తడిసిన ధాన్యంతో రైతుల కన్నీరు
నెల రోజులుగా వడ్లు కొనకుండా కాలయాపన
ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
బొమ్మకల్ ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి
కాకతీయ, కరీంనగర్ : సీఎం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం దిగుమతి కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మేయర్, డిప్యూటీ మేయర్తో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నెల రోజులుగా రైతులు వేడుకుంటున్నా వడ్లు కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తడిసిన ధాన్యం పేరుతో తాలు, తరుగు అంటూ భారీగా కోతలు విధిస్తూ అన్నదాతలను నిలువునా నష్టపరుస్తున్నారని విమర్శించారు. పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదని, పండించిన వడ్లను కూడా కొనకపోతే రైతులకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. నెలాఖరు వరకు వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తే దేనికైనా సిద్ధమన్నారు. వడ్ల కొనుగోలుకు అవసరమైన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే ఆ విషయాన్ని కేంద్రానికి లేఖ రాసి స్పష్టంగా చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ.. విధ్వంసకర వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. విధ్వంసంతో ఏమీ సాధించలేమని, డబ్బుల వసూళ్లే బీఆర్ఎస్ లక్ష్యమని విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవడం లేదనడానికి ఆ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

