నకిలీ ‘సదరం’
హుజురాబాద్ కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా
ఏళ్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులు
నిజమైన వికలాంగుల హక్కులను కాలరాస్తూ కొల్లగొడుతున్న వైనం
అక్రమంగా పొందిన సొమ్మును రికవరీ చేయాలని జనాల డిమాండ్
అక్రమాల నెట్వర్క్పై నోరు మెదపని అధికారులు
మౌనం వెనుక అసలు కారణాలేంటి?
గతంలో ఫిర్యాదులు వచ్చినా చూసీచూడనట్లుగా అధికారుల వైఖరి
కలెక్టర్ చిత్రామిశ్రా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్న జనం
కాకతీయ, కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతంలో నకిలీ సదరం సర్టిఫికెట్ల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. అర్హత లేకపోయినా కొందరు వ్యక్తులు ఫేక్ సదరం ధ్రువపత్రాలతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మారి ఏళ్లుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా వికలాంగులైన వారికి అందాల్సిన ప్రయోజనాలను అక్రమ మార్గాల్లో కొందరు దోచుకుంటున్నారనే ఆవేదన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, శారీరక వైకల్యం లేకపోయినా కొందరు వ్యక్తులు నకిలీ సదరం సర్టిఫికెట్లు పొందుతూ వికలాంగుల పెన్షన్లు, రాయితీలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ వ్యవహారం ఒక్కరోజులో ఏర్పడింది కాదని, దీని వెనుక ఒక పెద్ద నెట్వర్క్ పనిచేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజమైన వికలాంగులు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతుంటే, దర్జాగా ఉన్నవారు నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ డబ్బులు కొల్లగొడుతున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో కూడా ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత శాఖలు మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సొమ్ము రికవరీ చేయాల్సిందే
ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా పొందిన పెన్షన్లు, ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని కోరుతున్నారు. ఇందులో పాల్గొన్న మధ్యవర్తులు, సిఫారసులు చేసిన వ్యక్తులు, అక్రమాలకు సహకరించిన అధికారుల పాత్రపైనా లోతైన దర్యాప్తు జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలపై చిన్న తప్పులకే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు, ఇలాంటి పెద్ద మోసాల విషయంలో ఎందుకు నిద్రపోతున్నారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల మౌనంపై అనుమానాలు
నకిలీ సదరం సర్టిఫికెట్ల వ్యవహారం బహిరంగంగా చర్చకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు పెద్దగా చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమార్కులను కాపాడేందుకే వ్యవస్థ మౌనం పాటిస్తోందా, లేక రాజకీయ ప్రభావశీలుల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఒక సమగ్ర విచారణ జరిపించాలని హుజురాబాద్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఫేక్ సదరం సర్టిఫికెట్ల మాఫియాను బయటపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా పొందిన ప్రభుత్వ సొమ్మును తిరిగి రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

