సంతోష్ రావుకు బిగిస్తున్న ఉచ్చు
మైనింగ్ అక్రమాలపై సీఐడి నివేదిక
మానేరు కేంద్రంగా సాగిన దందాపై సర్కార్ ఫోకస్
అక్రమంగా వందల కోట్ల ఇసుక తరలింపు జరిగినట్లుగా గుర్తింపు
ఒకే పర్మిట్తో 4 ట్రిప్పులు, నకిలీ వే బిల్లులతో ఖజానాకు భారీగా గండి
మైనింగ్ శాఖ నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన సీఐడీ.. గులాబీ నేతల్లో టెన్షన్
అప్పట్లో సంచలనం సృష్టించిన నేరేళ్ల థర్డ్ డిగ్రీ ఘటన
ఇసుక మాఫియా వెనుక పొలిటికల్ హ్యాండ్స్.. చేతివేళ్లన్నీ సంతోష్ వైపే
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తెలంగాణలో మైనింగ్ మాఫియా లక్ష్యంగా సాగుతున్న విచారణలు, ఆకస్మిక తనిఖీలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా సాగిన మానేరు ఇసుక దందా వ్యవహారంపై అధికార యంత్రాంగం ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసింది. అప్పట్లో అధికార పార్టీ అండదండలతో సాగిన ఈ ఇసుక అక్రమాల వెనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ వ్యూహకర్తగా పేరున్న మాజీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు పాత్రపై ఇప్పుడు గట్టిగా ఉచ్చు బిగుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) రంగంలోకి దిగడంతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర అలజడి మొదలైంది.

వందల కోట్ల లూటీ.. పక్కా స్కెచ్తో దోపిడీ
సిరిసిల్ల కేంద్రంగా మానేరు వాగులో సాగిన ఇసుక మాఫియా కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్లలో నష్టం వాటిల్లినట్లు మైనింగ్ శాఖ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో రాయల్టీ, జీఎస్టీ, సీనరేజ్ ఫీజుల ఎగవేత భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రతిరోజూ సుమారు 800 టిప్పర్ల ఇసుకను హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు అక్రమంగా తరలించారని సమాచారం. దర్యాప్తులో వెలుగుచూసిన ప్రధాన అక్రమాలను పరిశీలిస్తే, వన్ పర్మిట్ – ఫోర్ ట్రిప్స్ విధానాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఒకే అనుమతి పత్రం ఉపయోగించి నాలుగు సార్లు ఇసుకను లోడ్ చేసి తరలించారు. రవాణా సాఫీగా సాగేందుకు నకిలీ వే బిల్లులను సృష్టించి అధికారులను బురిడీ కొట్టించారు. జీపీఎస్, ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వాహనాలు నడిపారు. నిబంధనల ప్రకారం 3 మీటర్ల లోతు వరకే అనుమతి ఉన్నా, భారీ యంత్రాలతో 25 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వేశారు. దీనివల్ల భూగర్భ జలాలు పడిపోయి పలు గ్రామాల్లో బావులు ఎండిపోయినట్లు గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), కాగ్ తమ నివేదికల్లో ఎండగట్టాయి.
నేరేళ్ల ఉదంతం.. కేటీఆర్ ఇమేజ్పై ప్రభావం
మానేరు ఇసుక దందా మళ్లీ తెరపైకి రావడంతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరేళ్ల ఘటనను రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించిన నేరేళ్ల గ్రామస్తులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇసుక మాఫియాకు బలమైన రాజకీయ అండ ఉండటం వల్లే ఆనాడు అంతటి దారుణం జరిగిందనే విమర్శలు ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. ఈ ఇసుక వ్యవహారం కారణంగా అప్పట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కూడా రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరిసిల్ల నియోజకవర్గంలో సాగిన ఇసుక అక్రమాలు, నేరేళ్ల ఘటన స్థానికంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టాయి, ఇది కేటీఆర్ ఇమేజ్పైనా తీవ్ర ప్రభావం చూపింది.
తాజా విచారణతో ఉత్కంఠ
2014 నుంచి 2026 వరకు జరిగిన మైనింగ్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, మైనింగ్ శాఖ తన ప్రాథమిక నివేదికను సీఐడీకి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా సూత్రధారులు, పాత్రధారుల జాబితాను సీఐడీ సిద్ధం చేస్తోంది. విచారణ మరింత ముమ్మరమైతే మాజీ ఎంపీ సంతోష్ రావుతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దల చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని, ఇది తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

