కల్తీ మద్యం తాగి 15 మంది మృతి
మద్యం తాగిన కొద్దిసేపటికే నోటి వెంట నురగలు
ఆ తర్వాత పరిస్థితి విషమించి మృతి
కాకతీయ, నేషనల్ డెస్క్ : మహారాష్ట్రలోని పూణే, పింప్రి-చించ్వాడ్ పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం మహమ్మారి భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. విషపూరితమైన కల్తీ మద్యం తాగి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. పింప్రి-చించ్వాడ్ లోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల్లో ఎనిమిది మంది మరణించగా, పూణేలోని కాలే పడల్ ప్రాంతంలో ముగ్గురు, హడప్సర్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘోర ఉదంతం వెలుగుచూసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అక్రమ మద్య వ్యాపారంలో మునిగిపోయిన యోగేష్ వాంఖడే అనే ప్రధాన నిందితుడు ఈ విషపూరితమైన స్పిరిట్ కలిపిన మద్యాన్ని తయారు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పూణే, పింప్రి-చించ్వాడ్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ ప్రమాదకరమైన మద్యాన్ని నిందితుడు విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలోనూ అనేక క్రిమినల్ కేసులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నోటి వెంట నురగలు వచ్చి మృతి
బాధితులు దాపోడి, ఫుగేవాడి, హడప్సర్, కాలే పడల్ ప్రాంతాల్లో ఈ కల్తీ మద్యాన్ని సేవించారు. మద్యం తాగిన కొద్దిసేపటికే వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. కొందరికి నోటి వెంట నురగలు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో పూణే ప్రాంతానికి చెందిన రాహుల్ శరద్ క్షీరసాగర్, విజయ్ భుకుర్లాల్ శర్మ, అరుణ్ దాదర్, అశోక్ రమేష్ చవాన్ తో పాటు ఒక గుర్తుతెలియని వ్యక్తి ఉన్నారు. పింప్రి-చించ్వాడ్ పరిధిలో మరణించిన వారిని పాండురంగ్ సదాశివ్ ఫుగే, విజయ్ ప్రకాష్ రాథోడ్, రాజేంద్ర ప్రకాష్ రాథోడ్, రాజేంద్ర రాజ్పుత్, అక్బర్ పఠాన్, ఆనంద్ దేశాయ్, ఆనంద నికాల్జేగా అధికారులు గుర్తించారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఇటువంటి అక్రమ, విషపూరిత కల్తీ మద్యం వల్ల అనేక మంది నిరుపేదలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

