తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే!
బండి సంజయ్ పట్టుదలతోనే బల్దియాపై కాషాయ జెండా
మండలానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం పెట్టాలి
ట్యాంక్ బండ్పై పంపకవి విగ్రహాన్ని ఆవిష్కరించాలి
బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ గడ్డను బీజేపీ అడ్డాగా బండి సంజయ్ నిలబెట్టారని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొనియాడారు. బండి సంజయ్ పట్టుదల, కరీంనగర్ బీజేపీ శ్రేణుల కసితోనే బల్దియాపై కాషాయ జెండా ఎగిరిందని స్పష్టం చేశారు. కరీంనగర్ లాంటి ఫలితం కోసమే తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని.. అందరి కృషితో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం తిమ్మాపూర్లో జరిగిన బీజేపీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన తీరుపై దేశ ప్రజలకు అమితమైన విశ్వాసం, నమ్మకం ఉన్నాయని.. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వస్తున్న విజయాలే ఇందుకు సాక్ష్యమన్నారు.
మండలానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం పెట్టాలి..
శిక్షణా కార్యక్రమం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, వారిని ఆదుకోవడానికి ప్రతి మండలానికి ఒక నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) కేంద్రాన్ని ప్రారంభించాలని కోరారు. గతంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ దిశగా ఆలోచించడం లేదని విమర్శించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని యువత ఈ కేంద్రాల కోసం ఎంతగానో ఎదురుచూస్తోందన్నారు. జీఎంఆర్ లాంటి సంస్థలు మూడు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఇలాంటి కేంద్రాలు నడపడం వల్లే ఎంతోమందికి ఉపాధి దొరుకుతోందని గుర్తుచేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) ప్రోత్సహించినప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందన్నారు. వరంగల్లో ఏర్పాటు చేయబోయే వస్త్ర పరిశ్రమల (టెక్స్టైల్) పార్కుకు ఎంతో చరిత్ర ఉందన్న ఆయన.. పూర్వం లండన్లోని హైడ్ పార్క్లో జరిగిన ప్రదర్శనలో వరంగల్ చేనేత దుప్పటి ప్రథమ బహుమతి సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.
ట్యాంక్ బండ్పై పంపకవి విగ్రహం ఆవిష్కరించాలి
భారతీయ భాషల్లో తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఉందని, అలాంటి మాతృభాషను మనమంతా పరిరక్షించుకోవాలని విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వేములవాడలో జన్మించిన పంపకవిని తెలుగుకు ఆదికవిగా భావిస్తామని తెలిపారు. అలాంటి గొప్ప కవి అయిన పంపకవి విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆవిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, మేకల ప్రభాకర్ యాదవ్, బొంతల కళ్యాణ్ చంద్ర, కార్పొరేటర్ రవీందర్, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, రామిడి మహేందర్, జక్కోజు అనిల్, ఓదెలు, అప్పల శ్రీనివాస్, దూలం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

