అభివృద్ధిలో ఆదర్శం కరీంనగర్
అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ
సంక్షేమ పథకాలతో ప్రజలకు భారీ లబ్ధి
ఇందిరమ్మ ఇళ్లతో 2,081 కుటుంబాల గృహప్రవేశం
రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఉద్యమకారుల పోరాటాలు, ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. 2014 జూన్ 2న సాకారమైన తెలంగాణ స్వప్నం నేడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ముందుకు సాగుతోందని చెప్పారు.


సంక్షేమ పథకాలతో ప్రజలకు భారీ లబ్ధి
మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో మహిళలు చేసిన 7.39 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ.334 కోట్ల లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. 1.58 లక్షల మందికి 9.23 లక్షల గ్యాస్ సిలిండర్లను రూ.500కే అందించామని వివరించారు. గృహజ్యోతి పథకం ద్వారా 1.73 లక్షల మంది వినియోగదారులకు రూ.153 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందన్నారు. రైతు భరోసా కింద 1.93 లక్షల మంది రైతులకు రూ.143.35 కోట్లు, రైతు బీమా కింద 267 మంది రైతుల కుటుంబాలకు రూ.13.35 కోట్ల పరిహారం అందించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 10,114 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, 7,076 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, 2,081 కుటుంబాలు గృహప్రవేశం చేశాయని చెప్పారు. యాసంగి సీజన్లో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.554 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 45,920 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు 3.20 లక్షల కుటుంబాలకు ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వృద్ధి, ఆరోగ్యం, మహిళా సాధికారతకు ప్రాధాన్యత
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు వందల కోట్ల రూపాయల రుణాలు అందించామని మంత్రి తెలిపారు. జిల్లాలో 1.33 లక్షల మందికి పైగా పింఛన్లు అందుతున్నాయని, 1.41 లక్షల మంది మహిళలకు ఉచిత చీరలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ ఫలితాల్లో జిల్లా 98.57 శాతం ఉత్తీర్ణత సాధించిందని అభినందించారు. 2,535 మంది ఎస్సీ విద్యార్థులకు హాస్టల్ ప్రవేశాలు, 29,240 మంది బీసీ విద్యార్థులకు రూ.74.43 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందించినట్లు వెల్లడించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 52,116 మందికి ఉచిత వైద్యం అందించగా, 777 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నట్లు వివరించారు. వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్, ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి క్లినిక్ విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ పరిశీలించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు అందజేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి వారి త్యాగాలను కొనియాడారు. విశిష్ట సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, కలెక్టరేట్లో కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ పతాకావిష్కరణ చేపట్టారు.

