తల్లి పేరుతో ప్రతీ ఒక్కరూ మొక్కను నాటాలి
ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కేంద్రం గొప్ప కృషి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారాజు రుక్మారావు
కాకతీయ, ఖమ్మం : ప్రతి ఒక్కరూ తమ కన్నతల్లి పేరుతో ఒక మొక్కను నాటి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారాజు రుక్మారావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని ఎదలాపురం మున్సిపాలిటీ వైరా మున్సిపాలిటీల పరిధిలోని పలు ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కలిసి నేతలు కార్యకర్తలు ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రంగారాజు రుక్మారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు ఏక్ పేడ్ మా కే నామ్ అనే ఒక అద్భుతమైన పిలుపునిచ్చారని దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు.
ప్రజా ఉద్యమంగా సాగాలి
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం తమ తల్లి పేరుతో కనీసం ఒక మొక్కనైనా నాటి దానిని సంరక్షించేలా ఇదొక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని రంగారాజు రుక్మారావు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014 నుంచే పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అందులో భాగంగానే దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించేలా అనేక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 260 కోట్లకు పైగా మొక్కలు నాటడం ద్వారా భారతదేశాన్ని హరితమయం చేస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కేంద్రం గొప్ప కృషి చేస్తోందని కొనియాడారు.
ప్రకృతిని కాపాడుకోవడం వాతావరణ సమతుల్యతను పరిరక్షించడం ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని ఇది మనందరి కనీస బాధ్యతని రంగారాజు రుక్మారావు స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు నాయకులు ఈ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలందరూ ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రతి ఇంట్లో తల్లి పేరుతో ఒక మొక్కను నాటి పచ్చని తెలంగాణ నిర్మాణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ నాయక్ జిల్లా కో-కన్వీనర్ శ్రీరామనేని మణి చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి సాయి వేల్పుల సుధాకర్ ఆర్వీఎస్ యాదవ్ కోటమర్తి సుదర్శన్ సత్తి నాగరాజు సాగర్ పాల్గొన్నారు.

