కాలం చెల్లిన పురుగుమందులు కాలువలో డంప్
ఎస్సారెస్పీ కెనాల్లో పెస్టిసైడ్స్ డబ్బాలు పడేసిన వైనం
ఇనుగుర్తి మండలం చిన్ననాగారం సమీపంలో నిర్వాకం
‘వర్షపు నీటిలో విషం కలిస్తే మూగజీవాల పరిస్థితి ఏమిటి?’
ఫర్టిలైజర్ షాపును సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
కాకతీయ, ఇనుగుర్తి : “కాలం చెల్లిన పురుగుమందులను కంపెనీకి తిప్పి పంపాల్సింది పోయి, బాధ్యతారహితంగా కాలువలో పడేస్తారా? వర్షాకాలం ప్రారంభమైన వేళ ఈ విషపూరిత ద్రావణాలు నీటిలో కలిస్తే.. ఆ నీరు తాగి మూగజీవాలు ప్రాణాలు కోల్పోవా? ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు ఇంతటి దారుణానికి ఒడిగడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు?” అని ఇనుగుర్తి మండలం చిన్ననాగారం, ఎర్రబెల్లిగూడెం గ్రామాల రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ డీబీఎం 48, 10 ఆర్ 1 కెనాల్ వద్ద చోటుచేసుకున్న ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుల నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయమై స్థానిక రైతులు మరియు వివిధ వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. “చిన్ననాగారం సమీపంలోని ఎర్రబెల్లి గూడెం రోడ్డు వైపు ఉన్న శ్రీరాంసాగర్ కాలువలో ఎక్స్పైరీ డేట్ ముగిసిన పెస్టిసైడ్స్ మందుల కాటన్ డబ్బాలను, ప్లాస్టిక్ సీసాలను విసిరి పారేశారు. పరిశీలించి చూడగా.. అది పత్తి, వేరుశనగ తదితర పంటల్లో కలుపు నివారణకు వాడే ‘పెండి మెథలిన్’ అనే ప్రమాదకర ద్రావణంగా తేలింది. దీని కాలపరిమితి 2023తోనే ముగిసిపోయింది. సమీపంలోని ఏదో ఒక పురుగుమందుల షాపు నిర్వాహకులే ఈ పని చేసి ఉంటారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో కాలువలోకి నీరు వచ్చి, ఆ ప్లాస్టిక్ డబ్బాలు పగిలితే విషమంతా నీటిలో కలుస్తుంది. ఆ నీటిని తాగే పశువులు, ఇతర మూగజీవాలు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులైన పెస్టిసైడ్ షాపును గుర్తించి, దానిని సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

