నేడు ‘వ్యకాస’ జిల్లా 25వ మహాసభలు
33 ఏళ్ల తర్వాత ముదిగొండ గడ్డపై నిర్వహణ
హాజరుకానున్న తమ్మినేని వీరభద్రం, వ్యకాస జాతీయ కార్యదర్శి బి. వెంకట్
కాకతీయ, ముదిగొండ : పోరాటాల పురిటిగడ్డ ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) జిల్లా 25వ మహాసభలు బుధవారం (జూన్ 10) నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరావు, సీపీఎం రాష్ట్ర నాయకుడు బండి రమేష్ తెలిపారు. మంగళవారం ముదిగొండలోని మచ్చ వీరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 33 సంవత్సరాల అనంతరం ముదిగొండ గడ్డపై జిల్లా మహాసభలు నిర్వహించడం ఒక ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఇండ్లు, ఇంటి స్థలాలు, సాగు భూమి కోసం జరిగిన చారిత్రాత్మక భూ పోరాటంలో నాడు 7 గురు వ్యవసాయ కూలీలు వీరమరణం పొందిన నేల ముదిగొండ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భారీ జనప్రదర్శన.. అనంతరం బహిరంగ సభ
మహాసభల విజయవంతం కోసం మండలంలోని అన్ని గ్రామాల్లో జనరల్ బాడీలు, గ్రూపు మీటింగ్ల ద్వారా ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించినట్లు లీడర్లు తెలిపారు. భూ పోరాట అమరుల స్థూపం, మచ్చ వీరయ్య భవనాన్ని నూతన రంగులు, తోరణాలతో అలంకరించినట్లు చెప్పారు. బుధవారం ఉదయం 8 గంటలకు ముదిగొండ భూ పోరాట అమరుల స్థూపం నుంచి వెంకటాపురంలోని రాయల కమలమ్మ ఫంక్షన్ హాల్ వరకు భారీ జనప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ప్రతినిధుల మహాసభలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మహాసభలకు ఖమ్మం మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘం నాయకులు రాయల వెంకటేశ్వర్లు, రాయల శ్రీనివాసులు, బట్టు పురుషోత్తం, వేల్పుల భద్రయ్య విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

