నెలాఖరులోగా కలెక్టరేట్ ప్రారంభం
కరీంనగర్లో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
జిల్లా పరిపాలనకు కొత్త కేంద్రంగా నూతన కలెక్టరేట్
పర్యావరణహిత వాతావరణం, అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణం
: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనం ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి నూతన భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన కలెక్టరేట్ పనులను కలెక్టర్ ప్రత్యేక చొరవతో వేగంగా పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం కల్పించిన నిధులతో, అత్యాధునిక సాంకేతిక వసతులతో ఈ భవనాన్ని సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలో మున్సిపల్ శాఖా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన పనులను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని చెప్పారు.
హెల్త్ హబ్గా కరీంనగర్ – విద్యా ప్రగతికి ఊపు
నూతన కలెక్టరేట్ ప్రాంగణాన్ని గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్తో ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని మంత్రి వివరించారు. కరీంనగర్ను హెల్త్ హబ్గా మార్చే దిశగా మెడికల్ కాలేజీని టీచింగ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశామన్నారు. అలాగే శాతవాహన యూనివర్సిటీలో లా, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుతో ఉన్నత విద్యావకాశాలను విస్తరించామని తెలిపారు. మానేరు రివర్ఫ్రంట్ రెండో దశ పనులను వేగవంతం చేస్తున్నామని, జిల్లాలో చేపడుతున్న ప్రతి కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

