ఇందిరమ్మ బిల్లుల మంజూరులో జాప్యం
అప్పుల ఊబిలో లబ్ధిదారులు
నిర్మాణాలు పూర్తి.. నిలిచిన చెల్లింపులు
నెలలు గడుస్తున్నా అందని తుది బిల్లులు
వడ్డీల భారం మోయలేక సతమతం
అప్పుల కోసం బంగారం తాకట్టు
ఆఫీసుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు
ప్రభుత్వ తక్షణ స్పందన కోసం వేచిచూపు
కాకతీయ, చేర్యాల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఆశ్రయం కల్పించినప్పటికీ, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ఫైనల్ బిల్లుల మంజూరులో జరుగుతున్న జాప్యం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా బిల్లులు అందక లబ్ధిదారులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి, సంబంధిత అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ధృవీకరణ పొందినప్పటికీ బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోంది. బిల్లులు రాకపోవడంతో నిర్మాణ సామగ్రి సరఫరాదారులకు, కూలీలకు చెల్లింపులు చేయలేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వడ్డీల భారం.. అధికారుల మౌనం
ఇంటి నిర్మాణానికి బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయడమే కాకుండా, బంగారం తాకట్టు పెట్టి మరీ పనులు పూర్తి చేసిన లబ్ధిదారులు ప్రస్తుతం వడ్డీల భారం మోయలేక ఆందోళన చెందుతున్నారు. ఫైనల్ బిల్లు కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి సరైన సమాధానం లభించడం లేదని, బిల్లుల జాప్యం తమ కుటుంబాలలో ఆందోళన కలిగిస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి, పెండింగ్లో ఉన్న చెల్లింపులను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

