సుడాలో ‘సిండికేట్’ టెండర్లు
రూ.7 కోట్ల అభివృద్ధి పనులపై ముందస్తు ఒప్పందాలు
35 పనుల పంపకాలపై డీల్.. 8-10 శాతం పగిడీల వసూలు?
డబుల్ బిడ్లతో పోటీ వాతావరణానికి గండి
స్వేచ్ఛగా టెండర్లు వేసే విధానానికి పాతర
అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ల మధ్య కుమ్మక్కు
ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ సుడా పరిధిలో అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. కేవలం నిబంధనల నిర్వహణకే పరిమితమైన టెండర్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, అధికార పార్టీకి చెందిన కీలక నేతలు, కాంట్రాక్టర్లు సిండికేట్గా మారి పనులను పంచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.7 కోట్ల విలువైన 55 అభివృద్ధి పనుల కేటాయింపులో జరిగిన ఈ ‘ముందస్తు ఒప్పందాలు’ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. మొత్తం 55 పనుల్లో ఇప్పటికే 35 పనుల పంపకాలపై అవగాహన కుదిరినట్లు సమాచారం. ఏ పని ఎవరికి దక్కాలి? ఎవరికి ఎంత వాటా రావాలి? అనే అంశాలపై టెండర్లు పిలవక ముందే ఒప్పందాలు జరిగిపోయాయని కాంట్రాక్టర్ల వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టెండర్ ప్రక్రియ అంతా కేవలం నామమాత్రపు ‘డ్రామా’ అని, ఫలితాలు ముందే ఖరారైనవేనని విమర్శలు వస్తున్నాయి.
పగిడీల దందా.. ‘బిడ్ల’ మాయాజాలం
ఈ అక్రమ దందాలో పగిడీల సంస్కృతి జోరందుకుంది. ప్రతి పనిపై 8 నుంచి 10 శాతం వరకు పగిడీలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పోటీని దెబ్బతీసేందుకు సిండికేట్కు చెందిన వారే ‘డబుల్ బిడ్లు’ దాఖలు చేస్తూ, ఇతర కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా చేస్తున్నారు. పారదర్శకతను దెబ్బతీస్తూ సాగుతున్న ఈ బిడ్ల మాయాజాలం వల్ల కొత్త వారికి, నిజాయితీ గల కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. స్వేచ్ఛాయుత పోటీ లేకపోవడంతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పోటీ లేనప్పుడు టెండర్లు అధిక ధరకు ఖరారయ్యే అవకాశం ఉండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. పైగా, సిండికేట్ పంచుకున్న పనుల్లో నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండదని, ఇది భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అక్రమ ఒప్పందాలతో కుదుర్చుకున్న పనులు కాబట్టి, వాటిని పూర్తి చేయడంలో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది.
ఉన్నతాధికారుల స్పందన ఏది?
సుడా పరిధిలో జరుగుతున్న ఈ టెండర్ల అక్రమాలపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, సిండికేట్ బాగోతాన్ని బయటపెట్టాలని కోరుతున్నారు. లేనిపక్షంలో అభివృద్ధి పనులన్నీ కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపే సాధనాలుగా మారుతాయని, ప్రజాధనం వృథా అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సుడా యంత్రాంగం నిద్రమత్తు వీడి, పారదర్శకతను కాపాడుతుందా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతుందా? అన్నది వేచి చూడాలి.

