ఖమ్మం నగర ప్రగతి భేష్
పర్యావరణ కేంద్రంగా డంపింగ్ యార్డు
ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి
అధ్యయనం చేసిన ధర్మపురి మున్సిపల్ బృందం
ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి
కాకతీయ, మయూరి సెంటర్ : నగర సమగ్ర అభివృద్ధిలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేములను నాగలక్ష్మి అన్నారు. అభివృద్ధి పనులను, పర్యావరణ పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు ఆమె నేతృత్వంలోని మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారుల ఉన్నత స్థాయి బృందం గురువారం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించింది. పర్యటనలో భాగంగా బృందం మొదట 54వ డివిజన్లోని ఎన్టీఆర్ పార్కును, అనంతరం యశస్వి రోడ్డులోని మున్సిపల్ నర్సరీని సందర్శించింది. అక్కడ మొక్కల పెంపకానికి తీసుకుంటున్న జాగ్రత్తలు, పార్కులోని ఆధునిక వసతులు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ధర్మపురిలో కూడా ఇలాంటి మోడల్ పార్కును ఏర్పాటు చేస్తామని నాగలక్ష్మి ప్రకటించారు. నగర డంపింగ్ యార్డులో జరుగుతున్న బయో-మైనింగ్ ప్రక్రియను చూసి బృందం ఆశ్చర్యపోయింది. దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించి, 22 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. బయో-మైనింగ్ ద్వారా వేరు చేసిన ‘బయో-సాయిల్’ను పచ్చదనం కోసం వాడుతుండటం విశేషమని, తమ ప్రాంతంలో కూడా డంపింగ్ యార్డులను ఇలాంటి ఆధునిక ప్రాసెసింగ్ కేంద్రాలుగా మారుస్తామని చైర్పర్సన్ స్పష్టం చేశారు.
లకారం చెరువు స్ఫూర్తితో..
ఖమ్మం నగరంలో రూ. 250 కోట్లతో నిర్మిస్తున్న నూతన మిర్చి మార్కెట్, లకారం చెరువు పునరుద్ధరణ పనులను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లకారం చెరువు సుందరీకరణ స్ఫూర్తితో ధర్మపురిలోని చెరువును కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వైస్ చైర్పర్సన్ ఇందరపు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మాజీ మేయర్ పి. నీరజ, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారిణి బెల్లం రాధిక, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అనిల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు మహేష్, శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్, స్థానిక మాజీ కార్పొరేటర్లు, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

