అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాలపై స్టే
ఫలితాల అమలు నిలిపివేత.. పాత కమిటీ కొనసాగింపు
వారం రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశం
రోజువారీ వ్యవహారాలకే పరిమితం కావాలని స్పష్టం
ఓటరు జాబితా తయారీలో నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాల అమలుపై వరంగల్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఓటరు జాబితా తయారీలో నిబంధనలను ఉల్లంఘించారని ట్రిబ్యునల్ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ముఖ్యంగా జనరల్ బాడీ సమావేశాలకు హాజరుకాని సభ్యులకు కూడా ఓటు హక్కు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాలపై స్టే విధిస్తూనే, గడ్డం విలాస్ రెడ్డి నేతృత్వంలోని పాత కమిటీని (పీఐసీ) తాత్కాలికంగా కొనసాగించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ఈ కమిటీ కేవలం రోజువారీ పరిపాలనా వ్యవహారాలు మాత్రమే చూడాలని, ఎలాంటి కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
నివేదికలు సమర్పించాలని ఆదేశం
ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఓటరు జాబితా, నోటిఫికేషన్, నామినేషన్ పత్రాలు, బ్యాలెట్ పేపర్లతో సహా అన్ని రికార్డులను భద్రపరచాలని, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వారం రోజుల్లోగా సమర్పించాలని జిల్లా సహకార అధికారిని, ఎన్నికల అధికారిని ట్రిబ్యునల్ ఆదేశించింది. గడ్డం విలాస్ రెడ్డి, అలుగు విద్యాసాగర్, మంగి రవీందర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో బ్యాంక్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

