ఫీజులపై నియంత్రణేది..?
అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేటు పాఠశాలలు
తల్లిదండ్రుల ఫిర్యాదులపై విద్యాశాఖ నామమాత్రపు చర్యలు
నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : డీఈఓ వి.శాస్త్రి
కాకతీయ, చేర్యాల : ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజుల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. అడ్మిషన్, ట్యూషన్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా ఛార్జీల పేరుతో యాజమాన్యాలు భారీగా వసూలు చేస్తుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల అక్రమాలపై తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా, విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాసంస్థల తీరుపై సమగ్ర విచారణ జరిపి, తప్పులు రుజువైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే గుర్తింపు రద్దు చేయాలని ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా, సేవా దృక్పథంతో పనిచేసేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని వారు కోరుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : డీఈఓ వి.శాస్త్రి
ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి వి.శాస్త్రి స్పష్టం చేశారు. అధిక ఫీజుల వసూళ్లపై లిఖితపూర్వక ఆధారాలతో ఫిర్యాదులు అందితే వెంటనే విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, గుర్తింపు రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, విద్యాశాఖ నిబంధనలను అందరూ పాటించాలని డీఈఓ సూచించారు.


