రెండు హత్యల కేసుల్లో నిందితుడికి జీవిత ఖైదు
తీర్పునిచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
కాకతీయ, గంభీరావుపేట : గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు వేర్వేరు హత్యల కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ వివరాలను వెల్లడించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగ సందీప్ రెడ్డి (26) అదే గ్రామానికి చెందిన బీనబోయిన దేవయ్యపై 2018 మార్చి 17న కత్తితో దాడి చేసి హతమార్చాడు. అదేవిధంగా 2022 జులై 31న కామారెడ్డి జిల్లా బీబీపేట మండలానికి చెందిన మన్నె నరసింహులుపై గొడ్డలితో దాడి చేయగా, ఆయన సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. హతుల బంధువుల ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణానంతరం నిందితుడి నేరం రుజువు కావడంతో అతనికి జీవిత ఖైదు విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో హంతకునికి శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన అప్పటి, ప్రస్తుత సంబంధిత పోలీస్ సిబ్బందిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు.

