రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా
ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
చింతకానిలో ఘనంగా మెగా రైతు మేళా
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
కాకతీయ, చింతకాని : రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో గురువారం నిర్వహించిన మెగా రైతు మేళాకు రైతులు విశేషంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మంత్రివర్గం రైతుల అవసరాలు, వ్యవసాయ రంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని, ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలు అందించాలని చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని వినియోగించుకుంటూ రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా ప్రాజెక్టుకు తరలిస్తున్నామని, దీంతో వర్షాలతో సంబంధం లేకుండా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేయలేదని, రైతులు నష్టపోకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం ఐదు వేల కోట్లు కేటాయించి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేశారని తెలిపారు. మొక్కజొన్నతో పాటు జొన్న, సోయా తదితర పంటలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. జూలై పది న జరిగే రైతు ఆశీర్వాద సభ చారిత్రక ఘట్టమని, రైతులకు అవసరమైన ప్రతి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
సాంకేతికతతోనే వ్యవసాయాభివృద్ధి
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను రైతులకు వివరించేందుకు ఈ మెగా రైతు మేళా నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి తెలిపారు. పంట మార్పిడి విధానం అమలు చేయడం, ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మెగా రైతు మేళా కోసం మొత్తం నూట యాభై స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మెగా రైతు మేళాకు ఐదు వేల మంది రైతులు వస్తారని అంచనా వేయగా దాదాపు పదకొండు వేల మంది రైతులు హాజరయ్యారని తెలిపారు. ఈ నెల పది న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు విచ్చేయనున్నారని, రైతు ఆశీర్వాదం పేరుతో మూడు లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్ధ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

