- నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తాం
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, కటారి కృష్ణ
- భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన
- కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
- ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, బీమా పథకం అమలు చేయాలని డిమాండ్
- ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తక్షణమే స్పందించకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాళ్ళబండి కృష్ణమూర్తి, కటారి కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు మరియు ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పోరాటాల ఫలితంగానే అక్రిడేషన్ కార్డుల మంజూరులో కొంత వెసులుబాటు కలిగిందని, ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ నిరసనకు వివిధ జర్నలిస్టు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.
అసమానతలపై జర్నలిస్టుల ఆగ్రహం
టీడబ్ల్యూజేఎస్, ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి జనుమాల రమేష్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1/70 చట్టాన్ని సాకుగా చూపి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, కానీ బడా భవనాలకు మాత్రం మినహాయింపులు ఇస్తున్నారని మండిపడ్డారు. నిలిపివేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం జర్నలిస్టు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కరోనా సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకుందని జర్నలిస్టు సంఘాల నేతలు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, జర్నలిస్టుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గతంలో ప్రారంభించిన ఇళ్ల స్థలాల ప్రక్రియను సైతం నిలిపివేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వనమా శ్రీనివాసరావు, అల్లాడ రమేష్, జి. మధు, జి. వేణు, కొడాలి వెంకటేశ్వర్లు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

