నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్
:సిఐ సాగర్
కాకతీయ, ఖమ్మం/కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను,గోల్డ్ కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి ఎస్సై గోపి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సింగరేణి సర్కల్ ఇన్స్పెక్టర్ సాగర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం… నిందితులు రాగితో ఆభరణాలను తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారంలా కనిపించేలా తయారు చేసేవారని, అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడంతో పాటు, ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించినట్లు విచారణలో తేలిందన్నారు.
ఇదే క్రమంలో రాంచందర్ యొక్క ఏజెంట్ అయిన సునీల్ తో ఇల్లందు ముత్తుట్ ఫైనాన్స్ లో 52 గ్రాముల బంగారం పెట్టించి 3.90 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. దానిని రిలీజ్ చేయించడానికి ప్లాన్ చేసి హైదరాబాద్ లోని “మన గోల్డ్ కంపెనీ ని సంప్రదించి వారియొక్క ప్రతినిధి ద్వారా 5.80 లక్షలు సునీల్ తీసుకొని మోసం చేసి పారిపోయారని వివరించారు. అట్టి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను కారేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.
ఈ కేసులో అరెస్టయిన నిందితుడి నుండి నేరం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన తెలుపు రంగు వేర్నా కారు (రిజిస్ట్రేషన్ నం. టి ఎస్04బి ఏ2616), రూ.15,000 నగదు, అలాగే నేరాలకు ఉపయోగించిన ఐ క్యూ కంపెనీ మొబైల్ ఫోన్ ను కారేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
అరెస్టు అయిన నిందితులు:
గుగులోత్ సునీల్ కుమార్, R/o. భాగ్యనగర్, కారేపల్లి. 2)ముందాడా రాంచందర్, R/o. కారేపల్లి.
పరారీలో ఉన్న నిందితుడు* దారవత్ రాకేష్, R/o. సూర్యతండా, కారేపల్లి.
ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో విచారణ అధికారి కారేపల్లి ఎస్సై గోపి, సహకరించిన కామేపల్లి ఎస్సై శ్రీకాంత్ ను అభినందిచారు.
ప్రజలకు విజ్ఞప్తి:
బంగారం తాకట్టు పెట్టే ముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత ఆభరణాల స్వచ్ఛతను తప్పనిసరిగా పరీక్షించుకోవాలని, అనుమానాస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని, అదేవిదంగా ఎవరైనా బాధితులు ఉంటే సంప్రదించగలరని సిఐ ప్రజలను కోరారు.

