భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!
చందుర్తి సీఐ రవీందర్ సూచనలు..
అవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి..
కాకతీయ, వేములవాడ :రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి మండలలలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందుర్తి సీఐ రవీందర్ సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు రావద్దని ఆయన కోరారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, కాలువలు ప్రమాదకరంగా మారాయని, వాటి వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దన్నారు. యువత, చిన్నారులు చెరువులు, కాలువల వద్ద సెల్ఫీలు తీసుకోవడం, ఈత కొట్టడం వంటి సాహసాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.వర్షాల కారణంగా రహదారులపై వాహనాలు స్కిడ్ అయ్యే అవకాశం ఉన్నందున వాహనదారులు పరిమిత వేగంతో, అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎలాంటి అత్యవసర సహాయం అవసరమైనా డయల్ 100/112కు లేదా స్థానిక పోలీసు అధికారులను వెంటనే సంప్రదించాలని సీఐ రవీందర్ కోరారు.

