ఎమ్మెల్సీ రేసులో రామకృష్ణ
ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సీనియర్ నాయకుడి వరుస భేటీలు
సీఎం రేవంత్, వేం నరేందర్రెడ్డి సానుకూల సంకేతాలు?
ఢిల్లీ పర్యటనతో ఆశావహుల్లో కొత్త చర్చ
కట్టర్ కాంగ్రెస్ వాదిగా పార్టీ అధిష్ఠానం వద్ద గుర్తింపు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, కట్టర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పేరు తాజాగా బలంగా వినిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుండగా, రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డి సైతం అనుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రామకృష్ణ వరుసగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఖర్గేను ఆయన నివాసంలో కలిసిన రామకృష్ణ.. అనంతరం కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠాన పెద్దలను కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ కార్యకర్తగా తన సుదీర్ఘ ప్రస్థానం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేస్తున్న కార్యక్రమాలు, రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎన్ఎస్యూఐలో సామాన్య కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ జీవితం దాదాపు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్లోనే కొనసాగుతోందని వివరించినట్లు తెలిసింది.
కట్టర్ కాంగ్రెస్ వాదిగా గుర్తింపు
ఎస్సీ వర్గానికి చెందిన రామకృష్ణ కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్కు విధేయంగా ఉందని, విదేశాల్లో వైద్య విద్య అభ్యసించినా స్వరాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చానని అధిష్ఠానానికి వివరించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా జైలు జీవితం గడిపిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తెలిపారు. యువతలో కాంగ్రెస్పై పెరుగుతున్న ఆదరణను కూడా వివరించినట్లు తెలిసింది.
సీఎం వైపు నుంచి సానుకూలత?
రామకృష్ణను కట్టర్ కాంగ్రెస్ నేతగా గుర్తించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయన అభ్యర్థిత్వంపై సానుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం రామకృష్ణకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అంశంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సీఎంకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డి కూడా రామకృష్ణ అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు ఉన్న నేపథ్యంలోనే రామకృష్ణ నేరుగా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠాన పెద్దలను కలిశారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరిన రామకృష్ణ, ఒకవేళ ఆ అవకాశం దక్కని పక్షంలో ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. పార్టీలో తన సేవలను గుర్తించి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తన పేరును కార్పొరేషన్ చైర్మన్ పదవికి సిఫారసు చేసిన విషయాన్ని కూడా వినతిపత్రం ద్వారా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
పోటీదారుల్లో పెరిగిన ఉత్కంఠ
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్లో పలువురు ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ పేరు రాష్ట్ర నాయకత్వం, అధిష్ఠానం స్థాయిలో చర్చకు రావడంతో పోటీదారుల్లో ఉత్కంఠ పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో సానుకూలత, సీఎంకు సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డి మద్దతు, తాజాగా ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీలు.. ఇవన్నీ రామకృష్ణ అభ్యర్థిత్వంపై చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లో ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ రేసులో రామకృష్ణ పేరు ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.

