చదువుతోనే తలరాత మారుతుంది
ప్రజాపాలనలో ఫూలే దంపతుల విధానాలు
అందరూ కలిసే చదివితే కులవ్యవస్థ నిర్మూలన
యంగ్ ఇండియా పాఠశాలలతో విప్లవాత్మక మార్పులు
ఫీజు రీయింబర్స్మెంట్ నెల రోజుల్లోనే పూర్తి చేస్తాం
క్రీడల్లో పతకాలు సాధిస్తే ఉద్యోగం, నజరానా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో పూలే దంపతుల విగ్రహాలు ఆవిష్కరణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : చదువుతో తలరాత మారుతుందని, ఆత్మగౌరవంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకేచోట చదువుతూ, కలిసి జీవించడం ద్వారా కుల వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే చూపిన బాటలో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మహనీయుల విగ్రహాలను చూసినప్పుడు వారి త్యాగాలు, స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలని సూచించారు. చదువే ఆయుధంగా మారుతుందని జ్యోతిబా ఫులే గుర్తించారని, అదే స్ఫూర్తితో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.


యంగ్ ఇండియా పాఠశాలలతో మార్పు
విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా పాఠశాలల ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందించడంపై దృష్టి సారిస్తున్నామని వివరించారు. కృత్రిమ మేధ కారణంగా నిపుణుల ఉద్యోగాలకు సైతం ముప్పు ఏర్పడుతున్న పరిస్థితుల్లో యువతకు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి ప్రపంచవ్యాప్తంగా రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోందని, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు అలాంటి నైపుణ్యాలు అందించి, అవసరమైతే ఆయా దేశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నెలలోనే
ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడాదికి రూ.2,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ముందుగానే క్రెడిట్ చేస్తున్నామని చెప్పారు. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని, కళాశాలలో ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జనగణనలో భాగంగా బలహీన వర్గాల లెక్కలు తేల్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏడాదిలోనే లెక్కలు తేల్చి ఫిబ్రవరి నాలుగో తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కొందరు కులగణన, జనగణన ప్రక్రియలో భాగస్వామ్యం కాకుండా కోర్టును ఆశ్రయించారని, అసెంబ్లీలో వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ చట్టపరంగా కమిషన్ ఏర్పాటు చేసి లెక్కలు తేల్చామని వివరించారు. జనాభా లెక్కలు తేల్చాలంటే కులగణన చేయక తప్పని పరిస్థితి ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన వంటి అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పతకాలు సాధిస్తే ఉద్యోగాలు
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సీఎం పిలుపునిచ్చారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నజరానాలు అందిస్తామని వెల్లడించారు. క్రీడల్లో ప్రతిభ చూపే యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. విద్యార్థులు చదువులు, క్రీడలు, పరిపాలన వంటి రంగాల్లో రాణించాలని సూచించారు. పారదర్శక పాలన అందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

