అక్రమాల పీవోకు చెక్
ఎట్టకేలకు భద్రాద్రి పీవో శంకర్ నాయక్కు ఉద్వాసన
టీజీఎండీసీ నుంచి మాతృసంస్థకు బదిలీ
ఏళ్లుగా కీలక బాధ్యతల్లో కొనసాగిన అధికారిపై ఆరోపణలు
ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్కు సహకరించారనే విమర్శలు
బీటీపీఎస్ ఇసుక లెక్కలు బయటపెట్టేదెప్పుడు?
ఆర్టీఐ దరఖాస్తులపైనా అధికారుల మౌనం
పాత వ్యవహారాలపై ఇప్పుడు టీజీఎండీసీలో చర్చ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు టీజీఎండీసీలో ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వహించిన జి.శంకర్నాయక్ను మాతృసంస్థకు పంపించారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం పీవోగా పనిచేసిన శంకర్నాయక్ను తాజాగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పీవో బాధ్యతల నుంచి తప్పించి మాతృసంస్థకు బదిలీ చేశారు. ఇసుక వ్యవహారాల్లో శంకర్నాయక్పై చాలాకాలంగా ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ బదిలీ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్ వ్యవహారాలకు శంకర్నాయక్ సహకరించారన్న ఆరోపణలు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం చేరేలా చేశారన్న విమర్శలు, మణుగూరు బీటీపీఎస్ టౌన్ నిర్మాణానికి తరలించిన ఇసుకకు సంబంధించిన లెక్కలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో బయటకు రాకపోవడం వంటి అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. శ్రీకర్ ఇసుక కాంట్రాక్టర్గా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రీచ్లు, ఇసుక రవాణా, స్టాక్యార్డుల వ్యవహారాలను తనకు అనుకూలంగా నడిపించేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అప్పట్లో భద్రాద్రి కొత్తగూడెం పీవోగా పనిచేసిన శంకర్నాయక్ సహకరించారన్న ఆరోపణలు టీజీఎండీసీ వర్గాల్లో చాలాకాలంగా చర్చలో ఉన్నాయి. డిపార్ట్మెంట్ బదిలీల్లో భాగంగా శంకర్నాయక్ను హెడ్ ఆఫీసుకు కేటాయించిన తర్వాత కూడా ఆయన తిరిగి భద్రాద్రి కొత్తగూడెం పీవోగా రావడం అప్పట్లో చర్చకు దారితీసింది. శ్రీకర్ తన పలుకుబడిని ఉపయోగించి శంకర్నాయక్ను డిప్యూటేషన్పై తిరిగి తీసుకువచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ జరగలేదు. ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్ రీచ్లు, రవాణా, స్టాక్యార్డుల వ్యవహారాల్లో ప్రభావం చూపించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనకు శంకర్నాయక్ సహకారం అందించారన్న విమర్శలు వచ్చాయి. ఇసుక దొంగతనం విస్తృతంగా సాగిన సమయంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టీజీఎండీసీ వర్గాల్లో చర్చ జరిగినట్లు సమాచారం. శంకర్నాయక్ భద్రాద్రి కొత్తగూడెం పీవోగా పనిచేసిన కాలానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీటీపీఎస్ ఇసుక లెక్కలపై ప్రశ్నలు
మణుగూరు బీటీపీఎస్ టౌన్ నిర్మాణానికి తరలించిన ఇసుక వ్యవహారంపై కాకతీయ ఇప్పటికే పరిశోధనాత్మక కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. అయితే బీటీపీఎస్కు ఏ క్వారీ నుంచి ఎంత పరిమాణంలో ఇసుక తరలించారు? ఎంత ఇసుకకు అనుమతి ఇచ్చారు? వాస్తవంగా ఎంత తరలించారు? ఎన్ని వాహనాలను వినియోగించారు? రవాణాకు సంబంధించిన రికార్డులు ఏమిటి? రాయల్టీ, ఇతర చెల్లింపులు ఎంత జరిగాయి? టీజీఎండీసీకి ఎంత ఆదాయం వచ్చింది? అనే వివరాలు ఇప్పటికీ పూర్తిగా బయటకు రాలేదు. అప్పట్లో పీవోగా పనిచేసిన శంకర్నాయక్తోపాటు సంబంధిత అధికారులు ఈ లెక్కలను బహిర్గతం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇసుక తరలింపులో ఎలాంటి అక్రమాలు జరగలేదంటే క్వారీ వారీగా, పరిమాణం వారీగా పూర్తి వివరాలను వెల్లడించేందుకు అభ్యంతరం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. బీటీపీఎస్ నిర్మాణానికి తరలించిన ఇసుకకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తే అసలు వ్యవహారం ఏమిటన్నది తేలే అవకాశం ఉంది.
ఆర్టీఐలపై మౌనం ఎందుకు?
బీటీపీఎస్ ఇసుక తరలింపునకు సంబంధించిన వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తులకు అధికారులు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ క్వారీ నుంచి ఎంత ఇసుక తరలించారు, అనుమతులు ఎవరు ఇచ్చారు, రవాణా ఎలా జరిగింది, చెల్లింపులు ఎంత జరిగాయి వంటి వివరాలను కోరినా సమగ్ర సమాచారం అందలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ఇసుక రీచ్లు, రవాణా, చెల్లింపుల రికార్డులు అందుబాటులో ఉంటే వాటిని వెల్లడించడంలో ఇబ్బంది ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీఐ దరఖాస్తులను పక్కన పెట్టడం వల్లే ఏదో దాచాల్సిన వ్యవహారం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయని విమర్శకులు అంటున్నారు. రీచ్ల నుంచి బయటకు వెళ్లిన ఇసుక పరిమాణం, అధికారిక రికార్డుల్లో నమోదైన పరిమాణం ఒకటేనా? స్టాక్యార్డుల్లో నమోదైన నిల్వలు, వాస్తవ నిల్వలు సరిపోతున్నాయా? అన్నది తేలాల్సి ఉంది.
పాత రికార్డులపైనే ఇప్పుడు దృష్టి
శంకర్నాయక్ బాధ్యతల మార్పిడి సమయంలో ఇసుక రీచ్లు, స్టాక్యార్డులు, వాహనాలు, పరికరాలు, పెండింగ్ కేసులు, ఆర్థిక వ్యవహారాలు, భద్రతా ఏర్పాట్లు, సమాచార సాంకేతిక వ్యవస్థలు, సీసీటీవీ వ్యవస్థలు సహా అన్ని రికార్డులను పూర్తిగా అప్పగించాలని టీజీఎండీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. రిలీవింగ్, బాధ్యతల స్వీకరణకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో శంకర్నాయక్ భద్రాద్రి కొత్తగూడెం పీవోగా పనిచేసిన కాలానికి సంబంధించిన ఫైళ్లు కీలకంగా మారాయి. రీచ్ల అనుమతులు, ఇసుక తరలింపు, స్టాక్యార్డుల నిల్వలు, రవాణా, రాయల్టీ, బిల్లులు, పెండింగ్ కేసులు, బీటీపీఎస్కు తరలించిన ఇసుకకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే ఇప్పటివరకు వెలుగులోకి రాని అంశాలు బయటపడే అవకాశం ఉంది. బాధ్యతలు అప్పగించే సమయంలో ఏ రికార్డులు సమర్పించారు? ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది? అన్న వివరాలు కూడా పరిశీలించాల్సి ఉంది.
మాతృ సంస్థకు బదిలీతో కొత్త చర్చ
భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పీవో బాధ్యతల నుంచి శంకర్నాయక్ను తప్పించి మాతృసంస్థకు పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతలను దశరథంకు అప్పగించారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని టీజీఎండీసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎట్టకేలకు శంకర్నాయక్ను టీజీఎండీసీ నుంచి మాతృసంస్థకు పంపగలిగారన్న చర్చ ఇప్పుడు ఆ సంస్థలోనే జరుగుతోంది. అయితే బదిలీతో పాత ఆరోపణలకు తెరపడుతుందా? లేక శంకర్నాయక్ పీవోగా పనిచేసిన కాలానికి సంబంధించిన రికార్డులపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలన చేపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీటీపీఎస్ ఇసుక తరలింపునకు సంబంధించిన అసలు లెక్కలు బయటకు వస్తాయా? ఆర్టీఐల్లో అడిగిన సమాచారాన్ని అధికారులు వెల్లడిస్తారా? అన్న ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. శంకర్నాయక్ మాతృసంస్థకు వెళ్లడంతో వ్యవహారం ముగిసినట్టేనా, లేక పాత ఇసుక లెక్కలపై ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారా అన్నదే ఇప్పుడు టీజీఎండీసీలో ఆసక్తికరంగా మారింది.

