బాలికల హాస్టల్లో దారుణ పరిస్థితులు
నీటి సౌకర్యం లేక విద్యార్థినుల అవస్థలు
వార్డెన్ వేధింపులపై విద్యార్థినుల ఆందోళన
సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థినులు, తల్లిదండ్రుల డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో నీటి సౌకర్యం లేక మూడో అంతస్తు వరకు బకెట్లతో నీటిని మోసుకెళ్లాల్సి వస్తోందన్నారు. బాత్రూమ్లు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. సమస్యలను వార్డెన్ దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నిస్తే బూతులు తిడుతూ వేధిస్తున్నారని, దాడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. మీడియా ముందు విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే కొందరు టీచర్లు విద్యార్థినులను గదుల్లోకి పంపి మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వినిపించాయి. తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వార్డెన్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

