గేట్ కారేపల్లిలో మత్స్యకార సొసైటీ వివాదం
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
తుమ్మలకుంట చెరువులో చేపల వేటతో లక్షల్లో నష్టం
పట్టాదారుల భూములపై సొసైటీ చట్టబద్ధతపై సందేహాలు
తక్షణ విచారణకు గ్రామస్తులు డిమాండ్
కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలంలోని గేట్ కారేపల్లి గ్రామంలో మత్స్యకార సొసైటీ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా సమస్య రోజురోజుకీ ముదురుతూ గ్రామస్తుల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. రెండు వేల పదకొండు సంవత్సరంలో ఏర్పాటైన మత్స్యకార సొసైటీ కార్యకలాపాలపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత పట్టా భూములు, దేవాదాయ భూములపై సొసైటీ ఎలా ఏర్పడిందని భూస్వాములు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల పాత్రపై కూడా గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కొంతమంది అధికారులపై కేసులు నమోదైనట్లు సమాచారం.

చెరువులో చేపల వేట… పరిస్థితి ఉద్రిక్తం
గ్రామంలోని తుమ్మలకుంట చెరువులో కొంతమంది వ్యక్తులు అనుమతి లేకుండా చేపల వేట చేపట్టడంతో సొసైటీకి లక్షల్లో నష్టం వాటిల్లిందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అధికారుల తప్పిదాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యకు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతినే పరిస్థితి నెలకొనడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్తులు, సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. భూస్వాముల హక్కులు కాపాడుతూ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు. పరిష్కారం ఆలస్యం అయితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

