నీటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి
పైప్లైన్ లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి
వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
చొప్పదండి మండలంలో పర్యటన
కాకతీయ, కరీంనగర్ : వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయతీల పరిధిలోని మల్లన్నపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆమె, అక్కడ అందుబాటులో ఉన్న మంచినీటి బావులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
నీటి సరఫరాపై స్పష్టమైన ఆదేశాలు
గ్రామాల జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పైప్లైన్లలో లీకేజీలను అరికట్టాలని, చేతి పంపులు, సింగిల్ ఫేజ్ మోటార్ల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎంపీఓలు, నోడల్ అధికారులను సూచించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి, సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ (RWS) అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం చొప్పదండిలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడొద్దని, వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించిన ఆమె.. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వార్డెన్ను ఆదేశించారు. సిబ్బంది విధిగా వసతి గృహంలోనే ఉండి విధులు నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) జగదీశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్, డీఈ వినయ్, తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీఓ వేణుగోపాల చారి, వార్డెన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

