కరీంనగర్ బల్దియాపై కాషాయం పట్టు
ఐదు కో ఆప్షన్ పదవులను స్వీప్ చేసిన బీజేపీ
ఫలించిన కేంద్రమంత్రి సంజయ్ వ్యూహం
కమలం గూటికి చేరిన నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు
పోటీకి దూరంగా కాంగ్రెస్.. బెంబేలెత్తిన గులాబీ శ్రేణులు
సామాజిక సమీకరణాలతో పదవుల్లో సామాన్యులకు పెద్దపీట
మున్సిపల్ కార్పొరేషన్లో మారిన రాజకీయ ముఖచిత్రం
బండి మార్గదర్శకత్వంలో పక్కాగా సాగిన ఆపరేషన్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని చాటింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పక్కా వ్యూహంతో ఐదుకు ఐదు స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ వేసిన స్కెచ్ సక్సెస్ కావడంతో కాషాయ దళం క్లీన్స్వీప్ సాధించింది. మొత్తం 38 మంది సభ్యులు బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ గీత దాటి బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఓటింగ్ ప్రక్రియలో గులాబీ పార్టీ తడబడగా కాంగ్రెస్ పార్టీ కనీసం పోటీకి కూడా నిలవలేక దూరంగా ఉండిపోయింది.

కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు
కోఆప్షన్ సభ్యుల ఎంపికలో బీజేపీ సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేయడం విశేషం. పార్టీ కోసం ఏళ్ల తరబడి జెండా మోసిన వారికే పదవులు కట్టబెట్టాలని బండి సంజయ్ ఇచ్చిన సంకేతాలను ఎంపిక కమిటీ తూచా తప్పకుండా అమలు చేసింది. మైనార్టీ విభాగంలో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసిన ముజీబ్కు అవకాశం కల్పించగా పట్టణంలోని సిక్కు సమాజ ప్రాధాన్యతను గుర్తిస్తూ బల్బీర్ సింగ్ను ఎంపిక చేశారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తూనే నిబద్ధత కలిగిన కార్యకర్తలకు గుర్తింపునివ్వడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ నిర్ణయంతో బీజేపీ క్షేత్రస్థాయిలో తన పట్టును మరింత బలపర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.
సామాన్యులకే పట్టాభిషేకం..
పదవుల పంపిణీలో నిరుపేద కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీజేపీ సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. బొమ్మకల్కు చెందిన నిరుపేద కార్యకర్త నందన్ కుమార్కు కోఆప్షన్ సభ్యత్వం దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కనీస వసతులు కూడా లేని స్థితిలో ఉన్న సామాన్య వ్యక్తిని గుర్తించి గౌరవించడం పట్ల పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎస్సీ మహిళా విభాగంలో చిగురు వెంకటమ్మకు అవకాశం ఇవ్వగా వైశ్య వర్గానికి చెందిన కన్నె కృష్ణను కూడా సభ్యుడిగా ఎంపిక చేశారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ సామాన్యులను చట్టసభలకు పంపడం ద్వారా బండి సంజయ్ తనదైన ముద్ర వేశారు.
మారిన రాజకీయ సమీకరణాలు
ఈ విజయంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న నగరంలో బీజేపీ క్లీన్స్వీప్ చేయడం బీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత కార్పొరేటర్లే బీజేపీకి ఓటు వేయడం ఆ పార్టీలోని అసమ్మతిని బయటపెట్టింది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోవడం ఆ పార్టీ బలహీనతను స్పష్టం చేస్తోంది. సామాన్య కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం ద్వారా రాబోయే రోజుల్లో కరీంనగర్ లో తిరుగులేని శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఫలితం జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

