‘అమరవీరుల స్మారక’ విశ్రాంతి భవనం
హుజూరాబాద్లో ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం
కాకతీయ, హుజూరాబాద్: పోలీసు సిబ్బంది సంక్షేమం, వసతి సౌకర్యాల మెరుగుదలే లక్ష్యంగా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ‘అమరవీరుల స్మారక సిబ్బంది విశ్రాంతి భవనాన్ని’ కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భవనంలోని వసతులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి గౌరవార్థం ఈ భవనానికి నామకరణం చేసినట్లు సీపీ తెలిపారు. ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమించే పోలీసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించగలరని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పని వాతావరణాన్ని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు. సరైన వసతులు ఉన్నప్పుడే అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సమర్థవంతంగా సేవలందించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు తిరుపతి, స్వాతి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

