రోడ్లపై వడ్ల కుప్పలు.. ప్రయాణికులకు తిప్పలు
ప్రమాదాల గుప్పిట్లో వాహనదారులు
కాకతీయ, చిగురుమామిడి: మండలంలోని నరసింహులపల్లె (అంటుకాలపల్లి) సహా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులపై ధాన్యం కుప్పలు వేయడం ప్రయాణికులకు శాపంగా మారింది. పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, కొంతమంది రైతులు నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రధాన రహదారులపైనే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. రహదారిపై ధాన్యం కుప్పల వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ కుప్పలు స్పష్టంగా కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. రహదారులపై ధాన్యం వేయవద్దని ఇప్పటికే అనేకసార్లు సూచించామని పోలీసులు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని రైతులు అధికారులకు సహకరించాలని, రహదారులను సురక్షితంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

