జమ్మికుంట కోఆప్షన్ ఎన్నిక వాయిదా
అభ్యర్థుల సంఖ్య పెరగడంతో నిర్ణయం
పారదర్శకతకే ప్రాధాన్యం : ఛైర్మన్ ప్రశాంత్ కుమార్
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీలో శనివారం జరగాల్సిన కోఆప్షన్ సభ్యుల ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడింది. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కోఆప్షన్ పదవుల కోసం ఆశావహుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 19కి చేరడంతో.. వారి ‘ఎపిక్స కార్డుల ధ్రువీకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు అదనపు సమయం అవసరమైందని ఛైర్మన్ వివరించారు. అనుభవం, నిబద్ధత కలిగిన వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేతో చర్చించి తుది నిర్ణయం..
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, త్వరలోనే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులతో చర్చించి కొత్త తేదీని ప్రకటిస్తామని ప్రశాంత్ కుమార్ తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ, పార్టీని బలోపేతం చేసే విధంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

