బండి సంజయ్కు కాంగ్రెస్ సవాల్
కుమారుడి వ్యవహారంపై పూర్తి నిజాలు చెప్పాలి
నిష్పక్షపాత దర్యాప్తు పూర్తయ్యే వరకు పదవికి దూరంగా ఉండాలి
కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు
కాకతీయ, కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు పూర్తయ్యే వరకు కేంద్ర మంత్రి పదవికి దూరంగా ఉంటానని బండి సంజయ్ ప్రకటించాలని సవాల్ విసిరారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన రాజేందర్ రావు.. మైనర్ బాలిక వ్యవహారంలో వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా సమర్పించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడికి క్లిన్ చిట్ వచ్చి, తన ప్రమేయం లేదని పూర్తిగా నిరూపితమయ్యే వరకు పదవికి దూరంగా ఉంటానని దేశ ప్రజలకు చెప్పాలని కోరారు.
పోలీసుల ఎదుట హాజరు చేయాలి
తన కుమారుడిని స్వయంగా పోలీసుల ముందు హాజరుపరచాలని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని పోలీసులను కోరాలని సూచించారు. అలాగే మేజిస్ట్రేట్ ఎదుట సీఆర్పీసీ 164 ప్రకారం స్టేట్మెంట్ ఇప్పించాలని అన్నారు. గతంలో ఇదే అంశంపై బండి సంజయ్ మాట్లాడిన విషయాలను గుర్తు చేస్తూ.. అదే నైతిక ప్రమాణాలు ఇప్పుడు తన కుటుంబానికి కూడా వర్తింపజేయాలన్నారు.
మైనర్ బాలికకు సంబంధించిన వ్యవహారంలో అసలు ఏమి జరిగిందో ప్రజలకు పూర్తిగా వెల్లడించాలని, ప్రజలను చీకట్లో ఉంచే ప్రయత్నాలు మానుకోవాలని రాజేందర్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్ఐటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. “సత్యం ఏదైనా బయటకు రావాలి” అని పేర్కొన్నారు.
నైతిక విలువలు ఆచరణలో చూపాలి
“మహిళల గౌరవం, సనాతన ధర్మం, నైతిక విలువలు గురించి మాట్లాడే బండి సంజయ్.. ఇప్పుడు వాటిని ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. లేకపోతే “దేశం కోసం.. ధర్మం కోసం” వంటి నినాదాలు కేవలం రాజకీయ పంచ్ డైలాగులుగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంలో ప్రజలు రాజకీయ ప్రతిస్పందనలు కాకుండా నిజాయితీ, పారదర్శకత, బాధ్యతాయుతమైన స్పందనను ఆశిస్తున్నారని రాజేందర్ రావు పేర్కొన్నారు. బాధిత బాలికకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని, తప్పు చేసిన వ్యక్తి తన కుమారుడే అయినా వదిలిపెట్టనని చెప్పే ధైర్యం బండి సంజయ్ చూపించాలని సవాల్ విసిరారు.
“బేటీ బచావో” నినాదాన్ని విశ్వసిస్తున్నామని చెప్పే నాయకులు దానిని ఆచరణలోనూ నిరూపించాలని అన్నారు. ప్రాథమికంగా ఆరోపణలు నిజమని తేలితే బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి తాను అండగా ఉంటానని రాజేందర్ రావు ప్రకటించారు. మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీ ఉండకూడదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

