ప్రాణాలు తీస్తున్న ఎల్ఈడీ కాంతులు
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు వినియోగం
కఠిన చర్యలకు సిద్ధమైన పోలీసులు
అలాంటి వాహనాలను సీజ్ చేస్తాం : చందుర్తి సీఐ రవీందర్
కాకతీయ, వేములవాడ : రహదారులపై రాత్రి వేళల్లో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. వాహనాలకు అమర్చుతున్న మిరుమిట్లు గొలిపే ఎల్ఈడీ లైట్లు, హైబీమ్ ఫోకస్లు ఇతర వాహనదారుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. యువత ఫ్యాషన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు చేస్తున్న మార్పులు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దీనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. బైక్లు, కార్లు, ట్రాక్టర్లు, ప్రైవేట్ బస్సులకు విచ్చలవిడిగా రంగురంగుల ఎల్ఈడీ లైట్లు అమర్చుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలపై ఈ హై-ఫోకస్ లైట్లు పడటంతో, ఇతర డ్రైవర్ల దృష్టి కొద్ది క్షణాల పాటు మందగిస్తోంది. దీంతో ఎదురుగా ఏముందో తెలియక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు వాహనదారులు చేస్తున్న ఈ అనవసర అలంకరణలు ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
అలాంటి వాహనాలను సీజ్ చేస్తాం : చందుర్తి సీఐ, రవీందర్
అనుమతిలేని ఎల్ఈడీ లైట్లు అమర్చుకుంటే వాహనాలను సీజ్ చేస్తామని చందుర్తి సీఐ రవీందర్ హెచ్చరించారు. వాహనాలకు ఎక్స్ట్రా ఫిట్టింగ్లు, మోడిఫికేషన్లు చేయడం మోటార్ వాహన చట్టంలోని సెక్షన్-52 ప్రకారం నేరమని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి వచ్చిన సాధారణ లైట్లు మాత్రమే ఉండాలని, అదనపు కాంతిని వెదజల్లే లైట్లు ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. ఇప్పటికే దీనిపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫ్యాషన్ కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ప్రాణ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వాహనదారులకు పిలుపునిచ్చారు.


