తూతూ మంత్రంగా ‘హెరిటేజ్ వాక్’!
మొక్కుబడి నిర్వహణపై జాకారం స్థానికుల ఆగ్రహం
ముందస్తు సమాచారం లేక వెలవెలబోయిన కార్యక్రమం
నాకేం సంబంధం లేదంటూ టూరిజం అధికారి శివాజీ పొంతన లేని సమాధానాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : కాకతీయుల అద్భుత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించిన ‘హెరిటేజ్ వాక్’ (వారసత్వ నడక) కార్యక్రమం తూతూ మంత్రంగా ముగిసింది. ములుగు జిల్లా జాకారం శివాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం కేవలం మొక్కుబడిగా సాగడంపై స్థానికులు, చరిత్ర ప్రేమికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తరహాలోనే, చారిత్రక ప్రాధాన్యత కలిగిన జాకారం శివాలయం వద్ద కూడా ఈ హెరిటేజ్ వాక్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది పూర్తిగా తుంగలో తొక్కారు. హెరిటేజ్ వాక్ నిర్వహణకు సంబంధించి జాకారం గ్రామ ప్రజలకు కనీస ముందస్తు సమాచారం అందించలేదు. ఫలితంగా గ్రామస్తులు ఎవరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాలేకపోయారు. దీంతో ప్రజలను చైతన్యపరచాల్సిన ఈ చారిత్రక నడక కేవలం కొద్దిమంది ప్రభుత్వ అధికారులకే పరిమితమై వెలవెలబోయింది.

కనీస సౌకర్యాలు కరవు.. మురికికూపంగా పరిసరాలు
జాకారం ఆలయ ప్రాంగణంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్నపాటి టెంట్, కొన్ని కుర్చీలు వేసి అధికారులు చేతులు దూలేసుకున్నారని మండిపడుతున్నారు. చారిత్రక ఆలయ పరిసరాలను కనీసం శుభ్రం కూడా చేయకపోవడంతో పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపించింది. ప్రజల భాగస్వామ్యం, కనీస ఏర్పాట్లు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ అసలు లక్ష్యం పూర్తిగా దెబ్బతింటుందని, భవిష్యత్తులోనైనా ముందస్తు సమాచారంతో పకడ్బందీగా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పర్యాటక శాఖ అధికారి పొంతన లేని సమాధానాలు
ఈ కార్యక్రమ వైఫల్యంపై జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీని ‘కాకతీయ’ ప్రతినిధి వివరణ కోరగా.. ఆయన బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. “ఈ హెరిటేజ్ వాక్ కార్యక్రమానికి నాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూనే, “ఈ కార్యక్రమం సరిగా జరగలేదు.. కానీ వచ్చే సారి జరిగే కార్యక్రమాలను మాత్రం ఘనంగా నిర్వహిస్తాం” అని పొంతన లేని సమాధానాలు చెబుతూ మాట దాటవేసి వెళ్ళిపోవడం గమనార్హం. జిల్లాలో పర్యాటక రంగాన్ని, చారిత్రక కట్టడాలను పర్యవేక్షించాల్సిన ప్రధాన అధికారే ఇలా బాధ్యత నుండి తప్పుకోవాలని చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి

