ఈ సారి కోలుకోలేని దెబ్బ తీస్తాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ హెచ్చరిక
మా సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకున్నాం
అమెరికా మళ్లీ దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు
మహమ్మద్ బాఖెర్ గాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్ : అమెరికా గనుక మూర్ఖత్వంతో మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తే ఈసారి అంతకంటే కోలుకోలేని, అత్యంత చేదైన పరాజయం తప్పదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ సీనియర్ సంప్రదింపుల ప్రతినిధి మహమ్మద్ బాఖెర్ గాలిబాఫ్ హెచ్చరించారు. గత ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) సమయాన్ని తమ సాయుధ దళాలు సైనిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఉపయోగించుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ టెహ్రాన్లో పర్యటించి, ఇరాన్ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు ముగిసిన వెంటనే గాలిబాఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ఫైర్ను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు ఇస్లామాబాద్ ముమ్మర దౌత్య ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ చర్చల్లో అమెరికా అడ్డగోలు డిమాండ్లు పెడుతోందని ఇరాన్ ఆరోపిస్తోంది. “ట్రంప్ మరోసారి తప్పు చేసి యుద్ధాన్ని ప్రకటిస్తే.. అది మొదటి రోజు యుద్ధం కంటే అమెరికాకు అత్యంత ఘోరంగా మారుతుంది” అని గాలిబాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ దేశ ప్రజల హక్కుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ట్రంప్తో మాట్లాడిన ఖతార్ అమీర్
మరోవైపు, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఇద్దరు నేతలు చర్చించారు. అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి భద్రత, సముద్ర రవాణా రక్షణ కోసం చర్చలు కొనసాగించడం అవసరమని ఖతార్ అమీర్ అభిప్రాయపడ్డారు.
మళ్లీ దాడులకు వైట్ హౌస్ ప్లాన్?
ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో, అమెరికా మళ్లీ సైనిక దాడులకు సిద్ధమవుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు ‘అక్సియోస్’, ‘సీబీఎస్ న్యూస్’ కథనాలను ప్రసారం చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ వేదికగా జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇవ్వకపోవడం, హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒకవేళ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తాము సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే హింట్ ఇచ్చారు. అమెరికా పదే పదే నమ్మకద్రోహానికి పాల్పడుతున్నా, తాము మాత్రం ఇంకా శాంతి చర్చలకు కట్టుబడే ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.

