ఈదురు గాలుల బీభత్సం
ఇల్లంతకుంట మండలంలో భారీ నష్టం!
ఇళ్ల పైకప్పు రేకులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం
గాల్లోకి లేచిన ట్రాక్టర్.. ఒకరికి తీవ్ర గాయాలు
ఐకేపీ కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి ధాన్యం
కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం బీభత్సం సృష్టించింది. హఠాత్తుగా వీచిన భారీ ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా మండలంలోని గాలిపల్లి, పత్తికింటపల్లి గ్రామాల్లో తీవ్ర ఆస్తి, పంట నష్టం సంభవించింది. గంటల పాటు సాగిన ఈ తుఫాను లాంటి వాతావరణంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. బలమైన గాలుల ధాటికి పలు ఇళ్ల పైకప్పు రేకులు గాల్లోకి ఎగిరిపోయాయి. పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగి రహదారులపై పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా స్తంభించింది. కాగా, గాలివాన తీవ్రతకు ఓ భారీ ట్రాక్టర్ గాల్లోకి లేచి నిలిచిపోయిన దృశ్యం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ క్రమంలో పత్తికింటపల్లి గ్రామానికి చెందిన చింతలపల్లి సత్తిరెడ్డి అనే వ్యక్తి ఈదురు గాలుల ధాటికి గురై తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
కన్నీరు పెడుతున్న అన్నదాత..
ఈ అకాల వర్షం రైతులకు కోలుకోలేని దెబ్బ తీసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఓపెన్ క్యాప్లలో నిల్వ ఉంచిన వరి ధాన్యం రాశులు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికే ఎండలు, ఇతర సమస్యలతో సతమతమవుతున్న తమకు ఈ వర్షం మరింత శాపంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మండలంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవడంతో పాటు తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

