రామారావు హంతకులను ఎందుకు తేల్చడం లేదు?
సీఎంను కలిస్తే కాంగ్రెస్ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకు?
ఏడు నెలల తర్వాత సీపీని కలవడం హాస్యాస్పదం
: సీపీఎం నేత మడిపల్లి గోపాలరావు
కాకతీయ, చింతకాని : సీపీఎం రాష్ట్ర నాయకుడు, పాతర్లపాడు మాజీ సర్పంచ్ సామినేని రామారావును హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. బుధవారం చింతకాని మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామినేని రామారావు హత్య జరిగి ఏడు నెలలు గడుస్తున్నా నిందితులను పట్టుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసి హంతకులను అరెస్ట్ చేయాలని కోరితే.. కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉలిక్కిపాటు వస్తోందని ప్రశ్నించారు. తాము సీఎంను కలిసినప్పుడు ఎవరి పేరు ప్రస్తావించలేదని, కేవలం హంతకులను పట్టుకోవాలని మాత్రమే కోరామన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ నాయకులు హుటాహుటిన ఖమ్మం సీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందని, ఏడు నెలలుగా నిందితుల అరెస్ట్ను అడ్డుకుంటున్నది వారేనని స్పష్టమవుతోందని ఆరోపించారు.
పోలీసులు, కాంగ్రెస్ కుమ్మక్కు?
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద పెద్ద కేసులను 24 గంటల్లో ఛేదించే పోలీసులు.. ఏడు నెలలుగా రామారావు హంతకులను ఎందుకు తేల్చడం లేదని గోపాలరావు నిలదీశారు. ఈ కేసులో పోలీసులు, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అధికారం, పోలీస్ యంత్రాంగం చేతిలో పెట్టుకుని రామారావు కుటుంబంపై ఆరోపణలు చేయడం కాదని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకుని, తమకు తామే నీతిమంతులమని కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పాలిగ్రాఫ్ టెస్టుల ద్వారా దేశంలో నిందితులను పట్టుకున్న చరిత్ర ఎక్కడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గనుక ఈ కేసుపై ‘సిట్’ వేస్తే తాము జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో గతంలోనూ పందిళ్ళపల్లి, పాతర్లపాడు, గోవిందాపురం గ్రామాల్లో సీపీఎం నాయకులను కాంగ్రెస్ పార్టీనే హత్య చేసిందని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

