జోరుగా జీరో దందా
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోట్లల్లో పన్నుల్లేని అక్రమ వ్యాపారం
ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సరుకుల దిగుమతి
నిత్యావసరాల నుంచి మొబైల్ పార్ట్స్ వరకు అంతా నకిలీలమయం
తనిఖీలు మరిచిన విజిలెన్స్, పోలీసు అధికారులు
మాముళ్లకే పరిమితమవుతున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘జీరో మాల్’ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే సరుకులు ఎలాంటి పన్నులు చెల్లించకుండా అడ్డదారుల్లో జిల్లాకు చేరుతుండటంతో ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కమర్షియల్ టాక్సెస్ (వాణిజ్య పన్నుల) శాఖ పర్యవేక్షణ లోపం, తనిఖీలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజూ రూ.50 కోట్లకు పైగా జీరో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సిగరెట్లు, పాన్ మసాలా, నిత్యావసర సరుకులు, దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ సామగ్రి, మొబైల్ యాక్ససరీస్, టైల్స్, ఇసుక, సిమెంట్, ఐరన్, విద్యుత్ పరికరాలు తదితర అనేక వస్తువులు భారీ స్థాయిలో జిల్లాకు చేరుతున్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం సరుకులు జీఎస్టీ బిల్లులు లేకుండానే కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
తెల్లకాగితంపైనే బిల్లులు…
జిల్లాలో జీరో మాల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో వినియోగదారులకు జీఎస్టీ బిల్లులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. పన్ను ఎగవేసేందుకు తెల్లకాగితంపై చేతిరాతతో రాసిన చీటీలనే బిల్లులుగా ఇస్తున్నారు. ప్రత్యేక వాహనాలు, కంటైనర్ల ద్వారా రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ సరుకుల రవాణా సాగుతోంది. కొందరు అధికారులతో కుమ్మక్కై ఈ జీరో సరుకుల రవాణా నిరాటంకంగా కొనసాగుతోందని, వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఈ అక్రమ రవాణాకు సంబంధించిన మామూళ్లే ప్రధాన ఆదాయ వనరుగా మారిందనే చర్చ నడుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జిల్లాలో స్థిరపడిన కొందరు వ్యాపారులే ఈ దందాకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తూ, నిషేధిత గుట్కా, పాన్ మసాలాలను సైతం ఇదే మార్గంలో తెప్పిస్తున్నారు.
నకిలీ సరుకులతో వినియోగదారులకు మోసం
జీరో సరుకుల వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా.. వినియోగదారులు కూడా దారుణంగా మోసపోతున్నారు. సబ్బులు, పప్పులు, సిగరెట్లు, వంటనూనెలలో పెద్దఎత్తున నకిలీ సరుకులు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ల పేర్లు మార్చి నాసిరకం నూనెలను విక్రయిస్తున్నారు. ఇక మొబైల్ ఫోన్ విడిభాగాల్లో దాదాపు 90 శాతం, వాహనాల విడిభాగాల్లో అత్యధిక శాతం నకిలీ వస్తువులే మార్కెట్లో చలామణి అవుతున్నాయి. దీంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు నాణ్యతలేని వస్తువుల వల్ల ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.
తనిఖీలు మరిచిన విజిలెన్స్, పోలీసు అధికారులు
జిల్లాలో రోజురోజుకూ ఈ జీరో దందా విస్తరిస్తున్నప్పటికీ సంబంధిత టాక్స్, విజిలెన్స్ మరియు పోలీసు యంత్రాంగం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అక్రమ రవాణా, జీఎస్టీ ఎగవేతపై టాస్క్ఫోర్స్ తనిఖీలు చేపట్టాలని, నకిలీ సరుకుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

