అన్నదానంతో ఆత్మ సంతృప్తి
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న
తడక లింగమూర్తి, శేరి బాల నారాయణ
కాకతీయ, చేర్యాల: ద్వాదశి పర్వదినం సందర్భంగా పేదలకు, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని శ్రీ అన్నపూర్ణాదేవి సేవా పరపతి సంఘం అధ్యక్షులు తడక లింగమూర్తి గుప్త, ప్రధాన కార్యదర్శి శేరి బాల నారాయణ గుప్త అన్నారు. గురువారం చేర్యాల స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని భవాని శంకర్ క్లాత్ షోరూమ్ వద్ద అన్నపూర్ణాదేవి సేవా పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు కమిటీ సభ్యులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదానం అంటేనే మనతో ఎలాంటి సంబంధం లేని నిరుపేదలను సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడిగా భావించి చేసే మహత్కార్యమని కొనియాడారు. అన్నదానం జరిగే చోటుకు భగవంతుడు పేదవారి రూపంలో వస్తాడని పురాణాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. గత రెండు సంవత్సరాలుగా ప్రతి ద్వాదశి రోజున శ్రీ అన్నపూర్ణాదేవి సేవా పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, దీనివల్ల తమకు ఎంతో పుణ్యం, మానసిక ప్రశాంతత కలుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. అన్ని దానాలకంటే అన్నదానం అత్యంత గొప్పదని, ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సమాజంలో తమకు తోచిన రీతిలో దానధర్మాలు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను, బంధాలను మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ నిర్వాహకులు, స్థానిక ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

