వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపు ఏకపక్షం
గిరిజన మహిళా సంఘానికి తీవ్ర అన్యాయం
నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ తీర్మానం
సొసైటీకి సమాచారం ఇవ్వకుండానే మరొకరికి అనుకూలంగా నిర్ణయం
గ్రామసభ నిర్వహణ.. తీర్మానం చెల్లదు..
కలెక్టర్, అధికారులకు మొరపెట్టుకున్నాం
అయినా పట్టించుకోవడం లేదు
వర్క్ ఆర్డర్ నిలిపివేసి మాకు న్యాయం చేయాలి
పినపాకలో శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ మహిళా సంఘం సభ్యుల ఆందోళన
కాకతీయ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వీరాపురం ఇసుక రీచ్ కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని దుగినేపల్లికి చెందిన “శ్రీగిరి లక్ష్మి ఇసుక క్వారీ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం లిమిటెడ్” సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 1964 చట్టం ప్రకారం నమోదైన తమ సంఘం, దశాబ్దాలుగా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇసుక కార్యకలాపాలు నిర్వహిస్తోందని వారు తెలిపారు. వీరాపురం ఇసుక రీచ్ విషయంలో అధికారులు, స్థానిక పంచాయతీ వ్యవహరిస్తున్న తీరు గిరిజన మహిళల జీవనోపాధిని దెబ్బతీస్తోందని వారు ఆరోపించారు.
ఏకపక్షంగా పంచాయతీ తీర్మానం
వీరాపురం ఇసుక రీచ్కు సంబంధించి ఈ ఏడాది మే 19న జిల్లా స్థాయి ఇసుక కమిటీ 1,85,500 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు ఆమోదం తెలిపింది. అయితే, ఆ ఉత్తర్వుల్లో ఏ సొసైటీ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆ తర్వాత రంగంలోకి దిగిన అధికారులు, ప్రాంతంలో రెండు గిరిజన మహిళా సంఘాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ దశలో, తమ సంఘానికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, కనీసం అభిప్రాయం కూడా తీసుకోకుండా గ్రామపంచాయతీ అధికారులు ఏకపక్షంగా మరో సంఘానికి అనుకూలంగా తీర్మానం పంపి, నిబంధనలను తుంగలో తొక్కారని సంఘ సభ్యులు వాపోయారు. అసలు గ్రామసభను చట్టబద్ధంగా నిర్వహించారా లేదా అనే అంశంపై కూడా తీవ్ర అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
అధికారుల వివక్షతోనే అన్యాయం
ఈ అక్రమాలపై బాధితులు కలెక్టర్, జిల్లా సహకార అధికారి, తెలంగాణ గనుల అభివృద్ధి సంస్థ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడం లేదని, అధికారుల వివక్ష వల్లే తాము అన్యాయానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామపంచాయతీ తీర్మానం చట్టబద్ధతపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు వీరాపురం ఇసుక రీచ్కు సంబంధించి ఎలాంటి వర్క్ ఆర్డర్ జారీ చేయకుండా నిలిపివేయాలని వారు స్పష్టం చేశారు. రెండు సంఘాలకు సమాన అవకాశాలు కల్పించి, తమ సంఘానికి వినికిడి అవకాశం కల్పించాలని కోరారు. గిరిజన మహిళల హక్కులను పరిరక్షించే విధంగా అధికారులు న్యాయమైన నిర్ణయం తీసుకోకపోతే, తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

