ఎమ్మార్వో ఆఫీసులో రాజకీయ పెత్తనం
చందుర్తి కార్యాలయంలో సామాన్యుడికి కష్టాలు!
నిబంధనలకు పాతర.. సిఫార్సులకే ప్రాధాన్యత
క్షేత్రస్థాయిలో అడ్రస్ లేని జీపీఓలు.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు
నెలల తరబడి పెండింగ్లో రేషన్ కార్డు దరఖాస్తులు
ప్రభుత్వ ఫైళ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి..
అనుమానాలకు తావిస్తున్న కార్యాలయ అధికారుల పనితీరు
మీడియాకు సైతం అందని సమాచారం.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి?
కాకతీయ, చందుర్తి : ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువగా ఉంచాల్సిన రెవెన్యూ వ్యవస్థ చందుర్తి మండలంలో పూర్తిగా నిర్వీర్యమైంది. తహశీల్దార్ కార్యాలయంలో నిబంధనల కంటే రాజకీయ సిఫార్సులకే ప్రాధాన్యం దక్కుతుండటంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. క్షేత్రస్థాయిలో ఉండాల్సిన జీపీఓలు గ్రామాల్లో అడ్రస్ లేకుండా పోవడంతో, సేవలు అందక ప్రజలు కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డుల దరఖాస్తుల వంటి పనుల కోసం ప్రజలు కార్యాలయానికి రానక్కర్లేకుండా గ్రామస్థాయిలోనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. జీపీఓలు తమ విధులను సక్రమంగా నిర్వహించకపోవడంతో పనులన్నీ తహసీల్దార్ కార్యాలయం వద్దే ఆగిపోతున్నాయి. సమయపాలన లేకపోవడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లో ఉన్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ ఫైళ్లు?
చందుర్తి రెవెన్యూ కార్యాలయంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ఫైళ్లు, దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనిపిస్తున్నాయనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో జరగాల్సిన అధికారిక ప్రక్రియలు బయటి వ్యక్తుల ప్రమేయంతో నడుస్తున్నాయా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ఉండాల్సిన బాధ్యత, పారదర్శకత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం అంటే, వ్యవస్థ ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా సమస్యలపై వస్తున్న ఆరోపణలపై అధికారిక వివరణ కోరిన మీడియా ప్రతినిధులపై తహసీల్దార్ భూపతి వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. మండలంలో జరుగుతున్న జాప్యం, జీపీఓల పనితీరు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్ చేసినా, ఆయన స్పందించకపోవడం గమనార్హం. పారదర్శకతకు ప్రతీకగా ఉండాల్సిన అధికారి, ప్రజా సమస్యలను ప్రశ్నించే మీడియాకు కూడా జవాబుదారీగా ఉండకపోవడంపై మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మౌనం.. ప్రజా ఆగ్రహం
గ్రామాల్లో ఉండాల్సిన జీపీఓలు ఎక్కడున్నారు? రాజకీయ నాయకుల సిఫార్సులు లేకపోతే సామాన్యుడి పని కాదా? ప్రభుత్వ కార్యాలయాల్లో బయటి వ్యక్తుల ప్రమేయం ఎందుకు? కొత్త రేషన్ కార్డుల జాప్యానికి బాధ్యులెవరు? అంటూ మండల ప్రజల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మండలంలో నెలకొన్న ఈ దారుణ పరిస్థితులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయ పనితీరు, సిబ్బంది ప్రవర్తన, అక్రమ దరఖాస్తుల పెండింగ్పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత కరువైతే, సామాన్యుడికి గతి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

