నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడీ యాక్ట్
విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, మయూరి సెంటర్ : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడటంతో పాటు, నకిలీ విత్తనాలు మరియు పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గురువారం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, నాసిరకం పురుగుమందులు విక్రయిస్తూ రైతులను మోసం చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఫెర్టిలైజర్స్ మరియు సీడ్స్ షాపులను సందర్శించిన అధికారులు విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణను, ప్యాకెట్లపై గడువు తేదీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని ఆయన సూచించారు. అనుమానాస్పదంగా కనిపించే విత్తనాలు, ఎరువుల గురించి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సత్తుపల్లి, వైరా, తల్లాడ, చింతకాని, కామేపల్లి, తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు.

