మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యం
మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు
ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశాభివృద్ధి
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లే లక్ష్యం
కేంద్ర మంత్రి బండి సంజయ్
సీఎస్సార్ నిధులతో ఎల్ఎండీ కాలనీలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
కాకతీయ, కరీంనగర్: మహిళా సాధికారతకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని ఎల్ఎండీ కాలనీలో ఉన్న మహిళా శిశు వికాస్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్సార్ నిధులతో సమకూర్చిన కుట్టు మిషన్లను స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మహిళలకు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. గతంలో ఆటోల పంపిణీతో పాటు, ఇప్పటివరకు సుమారు వెయ్యి కుట్టు మిషన్లు, ట్రాలీ ఆటోలను మహిళలకు అందజేశామని తెలిపారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం దక్కినప్పుడే దేశం పురోగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మహిళా సంక్షేమానికి కేంద్రం పథకాలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ.. రూ. 9 వేల కోట్లతో 11 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పీఎం ఆవాస్ యోజన కింద మహిళల పేరిట 4 కోట్ల ఇళ్ల నిర్మాణం, మరో 3 కోట్ల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మాతృ వందన యోజన పథకం ద్వారా గర్భిణులకు నగదు ప్రోత్సాహకాలు, మిషన్ శక్తి ద్వారా 2021-26 మధ్య రూ. 21 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన ద్వారా మంజూరు చేసిన రుణాల్లో 70 శాతం మహిళలకే దక్కాయి. అంతేకాకుండా బేటీ బచావో-బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, నమో డ్రోన్ దీదీ, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి కేంద్రమంత్రి బండి సంజయ్ అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా ఆర్థికాభివృద్ధి సంఘం చైర్మన్ శోభారాణి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

