నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
విద్యుత్ వసతుల విస్తరణలో భాగంగా 13 కొత్త సబ్ స్టేషన్ల మంజూరు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కాకతీయ, రుద్రంగి: రైతులకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం రుద్రంగి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. రుద్రంగి ప్రాంతంలో చాలా కాలంగా కొనసాగుతున్న లో వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గతంలో ఉన్న 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్కు అదనంగా మరో 8 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించామని, దీనివల్ల విద్యుత్ సరఫరా మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల 6 నెలల్లో 13 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేశామని, రుద్రంగి, నూకలమర్రి, ఎన్గల్, లింగంపేట, మరిమడ్ల, పోసానిపేట, సిరికొండ, భీమారం, కాచారం, పోరుమల్ల ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల విస్తరణ కొనసాగుతోందని వివరించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు అంతరాయం లేకుండా ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ, రుద్రంగికి 132 కేవీ సబ్ స్టేషన్ మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని, నియోజకవర్గంలో 2800కు పైగా మిడిల్ పోల్స్ ఏర్పాటు చేసి, గతేడాది 1300 మంది రైతులకు కొత్త కనెక్షన్లు అందించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

