వాల్టాకు ఆర్ఎంసీ ప్లాంట్ తూట్లు
భూగర్భ జలాలను తోడేస్తున్న అక్రమ ప్లాంట్
పర్యావరణ విధ్వంసానికి పరాకాష్ట.. ఎండిపోతున్న పంట పొలాలు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
నిబంధనలను గాలికి వదిలేసిన యాజమాన్యం
చట్టపరమైన చర్యల కోసం రైతుల పోరాటం
రంగంలోకి దిగిన ఇంటిలిజెన్సీ నిఘా

కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో వాల్టా చట్ట నిబంధనలను తుంగలో తొక్కి నిర్వహిస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్ స్థానికుల పాలిట శాపంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ ప్లాంట్ అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టం-2002 ప్రకారం వ్యవసాయ భూమిని కమర్షియల్ అవసరాలకు వాడుకోవాలంటే ముందుగా నాలా కన్వర్షన్ అనుమతులు తప్పనిసరి. అయితే, ఇక్కడ నిబంధనలను పక్కన పెట్టి, ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచి ప్లాంట్ను నిర్వహిస్తున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. నేషనల్ హైవేల నిర్మాణం, అభివృద్ధి పేరుతో ఇంతటి ఘోరమైన పర్యావరణ విధ్వంసానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

భూగర్భ జలాల దోపిడీతో ఎండిపోతున్న బోర్లు
ఆర్ఎంసీ ప్లాంట్ నిర్వహణకు నిత్యం వేల లీటర్ల నీరు అవసరం. దీని కోసం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ పొందాలి, కానీ యాజమాన్యం అలాంటి ప్రయత్నం చేయకుండానే భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తోంది. ప్లాంట్ స్థాపన కోసం అనుమతులు లేకుండానే రెండు భారీ బోరుబావులను తవ్వినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న రైతుల బావులు, బోర్లు పూర్తిగా ఎండిపోయి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్లాంట్ నుంచి వెలువడుతున్న సిమెంట్ వ్యర్థాలు, దుమ్ము, ధూళి వల్ల పంట పొలాలు కలుషితమవ్వడమే కాకుండా, గాలి కూడా విషతుల్యంగా మారుతోంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం వెనుక మతలబు ఏమిటో తెలియక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాల్టా చట్టం ఏం చెబుతోంది?
వాల్టా-2002 చట్టం ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ లేకుండా వ్యవసాయ భూమిని ఇతర ప్రయోజనాలకు వాడుకోవడం, అనుమతి లేకుండా భూగర్భ జలాలను వినియోగించడం చట్టరీత్యా నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీ యాజమాన్యాలకు పది వేల రూపాయల జరిమానాతో పాటు, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చట్టం స్పష్టం చేస్తోంది. కాచిరాజుగూడెంలో అక్రమంగా నడుస్తున్న ఈ ప్లాంట్పై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే స్పందించి, ప్లాంట్ను సీజ్ చేయాలని, బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఇప్పటికైనా అక్రమార్కులపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
ఇంటెలిజెన్సీ అధికారుల ఆరా!?
కాచిరాజుగూడెం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ ఆర్ఎంసీ ప్లాంట్పై ‘కాకతీయ’ పత్రిక వరుస కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే. పత్రికలో వచ్చిన కథనాలకు ఇంటిలిజెన్సీ అధికారులు స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాంట్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? నాలా పర్మిషన్ అసలు ఎంత భూమికి తీసుకున్నారు? ప్రభుత్వ ఆదాయానికి ఎంత మేర గండి కొట్టారు? అనే విషయాలపై నిఘా వర్గాలు లోతుగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు నిఘా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అక్రమ ప్లాంట్ వ్యవహారంలో ఎవరెవరికి ప్రమేయం ఉందనే అంశంపై ఇప్పుడు స్థానికంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

