బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
కరీంనగర్లో రెండు పార్టీ నేతల మధ్య ఘర్షణ
కేంద్రమంత్రి బండి కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల యత్నం
అడ్డుకున్న బీజేపీ శ్రేణులు.. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట
పరస్పరం దాడి చేసుకున్న రెండు పార్టీ నేతలు
పరిస్థితి చేదాటడంతో పోలీసుల లాఠీఛార్జ్
పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలు
కాకతీయ, కరీంనగర్: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో కరీంనగర్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగా భారీగా మోహరించిన పోలీసులు ఎంపీ కార్యాలయం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. అయితే నిరసనకారులు బారికేడ్లను దాటి ఎంపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, కొద్దిసేపటికే తోపులాట, కర్రలతో పరస్పర దాడులకు దారి తీసింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ నిర్వహించారు. పోలీసుల లాఠీఛార్జ్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొంతసేపు ఎంపీ కార్యాలయం పరిసర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, అనంతరం పోలీసులు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులు తమ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు, తాము నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లగా బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.


