ఏడాది కాకతీయ
సత్యం వైపు.. సమాజం కోసం..
ఇది ఒక వార్తాపత్రిక ప్రయాణం కాదు… ప్రజా నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యం. “పత్రిక అంటే అధికారుల ప్రెస్నోట్లు ముద్రించే యంత్రం కాదు… అధికారాన్ని ప్రశ్నించే అద్దం.” ఈ భావనతోనే 2025 ఆగస్టు 8న ‘కాకతీయ’ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నేటితో ఆ ప్రయాణం ఏడాది పూర్తి చేసుకుంది. సాధారణంగా ఒక కొత్త పత్రికకు మొదటి సంవత్సరం అంటే మనుగడ కోసం పోరాటం. కానీ కాకతీయకు మాత్రం మొదటి సంవత్సరం… మనుగడతో పాటు ప్రజా విశ్వాసాన్ని సంపాదించుకునే యుద్ధం. ఆ యుద్ధంలో కాకతీయ కేవలం నిలబడలేదు… తనదైన ముద్ర వేసింది. పెద్ద పెద్ద కార్పొరేట్ మీడియా సంస్థలు కోట్ల రూపాయల పెట్టుబడులతో, వందలాది మంది సిబ్బందితో పనిచేసే కాలంలో… పరిమిత వనరులతో ప్రారంభమైన ఒక ప్రాంతీయ డిజిటల్ పత్రిక ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించడం చిన్న విషయం కాదు. అది ప్రకటనల బలం వల్ల కాదు… అధికార అనుగ్రహం వల్ల కాదు… నిజాన్ని రాజీపడకుండా చెప్పాలనే సంపాదకీయ ధైర్యం వల్ల. ఈ ఏడాది కాలంలో కాకతీయ అనుసరించిన విధానం ఒకటే. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య… ప్రభుత్వానికి చేరాలి. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరాలి. ఈ రెండింటి మధ్య వారధిగా నిలవాలి. ఇదే ఆలోచన కాకతీయను ఇతర ప్రాంతీయ మీడియా వేదికల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది.
వార్తలు కాదు… వాస్తవాల వేట
నేటి మీడియా ప్రపంచంలో ‘ఫస్ట్’ కోసం పోటీ ఎక్కువ. కానీ కాకతీయ ‘ట్రూత్ ఫస్ట్’ అనే సూత్రాన్ని ఎంచుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతి సమాచారాన్ని వార్తగా మార్చలేదు. అధికారుల ప్రకటనలను యథాతథంగా ప్రచురించలేదు. ఒక సమాచారం చేతికి వస్తే… దానికి ఆధారాల కోసం వెతికింది. పత్రాలు సేకరించింది. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసింది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించింది. అన్ని వైపుల సమాచారం సేకరించిన తర్వాతే కథనాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అందుకే కాకతీయ కథనాలకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. అవి కేవలం ఆరోపణలుగా మిగలలేదు. ఆధారాలతో కూడిన ప్రజా పత్రాలుగా నిలిచాయి. ఏ పత్రిక అయినా తన ఎడిటోరియల్ పాలసీని మాటల్లో చెబుతుంది. కాకతీయ మాత్రం దానిని కథనాల్లో చూపించింది. రైతు భూమి సమస్య నుంచి మొదలుకొని… ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం వరకు… ఇసుక మాఫియా నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణల వరకు… స్థానిక సంస్థల అవినీతి నుంచి వేల కోట్ల ప్రాజెక్టుల దోపిడీల వరకు… ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిరంతరం వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో కాదు… ప్రజల సమస్య పరిష్కారమే లక్ష్యంగా వార్తలను ప్రచురించింది. అందుకే కాకతీయ కథనాల తర్వాత అనేక సందర్భాల్లో అధికారులు స్పందించారు. విచారణలు జరిగాయి. చర్యలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం కూడా తిరిగి వచ్చింది. ఒక వార్త సమాజంలో మార్పు తీసుకురావాలంటే… ఆ వార్త వెనుక నిబద్ధత ఉండాలి. కాకతీయ మొదటి ఏడాది అదే నిరూపించింది.
రాజీపడని కలం… వెనక్కి తగ్గని వైఖరి
ఒక అవినీతి కథనం ప్రచురించడం సులభమే. కానీ ఆ కథనం తర్వాత వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. మొదటి ఏడాదిలోనే కాకతీయ ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంది. ప్రకటనల ఒత్తిడి… రాజకీయ ఒత్తిడి… అధికార యంత్రాంగం ఒత్తిడి… దుష్ప్రచారాలు… కేసుల బెదిరింపులు… వ్యక్తిగత దాడులు… సోషల్ మీడియా ట్రోలింగ్… అన్నింటినీ ఎదుర్కొంది. కానీ ఒక విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడలేదు. వార్త నిజమైతే… దానిని ప్రచురించడంలో వెనక్కి తగ్గలేదు. అదే కాకతీయను పాఠకులకు దగ్గర చేసింది. కొంతమంది ఇప్పటికీ ఒక అపోహలో ఉంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది వ్యతిరేకత అని. కానీ కాకతీయ మొదటి ఏడాది చూపించిన విధానం వేరు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను స్వాగతించింది. మంచి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అదే సమయంలో… ప్రజా ధనాన్ని దోచుకునే ప్రయత్నాలను మాత్రం తీవ్రంగా ఎండగట్టింది.
అందుకే ఒకవైపు ప్రభుత్వ శాఖల పనితీరును ప్రశంసించిన కథనాలే కనిపిస్తే… మరోవైపు అదే శాఖలో జరుగుతున్న అవినీతిని కూడా బహిర్గతం చేసిన కథనాలు కనిపించాయి. ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ధోరణి కాదు. ప్రజలకు అనుకూలంగా ఉండే జర్నలిజం.
పత్రిక కాదు… ప్రజల వేదిక
గత ఏడాది కాలంలో కాకతీయకు వచ్చిన వేలాది సమాచారం అన్నీ పెద్ద నాయకుల నుంచి రాలేదు.
సాధారణ రైతు, ఒక గ్రామస్తుడు, ఒక ఉద్యోగి,ఒక బాధిత మహిళ, ఒక యువకుడు, ఒక గిరిజనుడు… వీరే కాకతీయ అసలైన రిపోర్టర్లు. వాళ్లు పంపిన సమాచారాన్ని పరిశీలించింది. ఆధారాలు సేకరించింది. నిజమైతే ప్రచురించింది. దీంతో కాకతీయ ఒక మీడియా సంస్థగా మాత్రమే కాకుండా… ప్రజలు నమ్మి సమస్య చెప్పుకునే వేదికగా మారింది. నిజం చెప్పడం సులభం కాదు… కానీ అవసరం.
“యథార్థవాది… లోకవిరోధి” అనే నానుడి చాలా మందికి తెలుసు. నిజం చెప్పేవాడు అందరికీ నచ్చడు.
అక్రమాలు బయటపెడితే అక్రమార్కులకు నచ్చదు. అవినీతి వెలుగులోకి తెస్తే అవినీతిపరులకు నచ్చదు. మాఫియాలపై రాస్తే మాఫియాలకు నచ్చదు. అదే కాకతీయ కూడా అనుభవించింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. దాడులు చేసిన వారు తాత్కాలికం… నమ్మకం ఇచ్చిన పాఠకులు శాశ్వతం. అందుకే ప్రతి దాడి తర్వాత… ప్రతి దుష్ప్రచారం తర్వాత… కాకతీయకు మరింత మంది పాఠకులు జత కలిశారు.
గొప్పదనం సర్క్యులేషన్తో కాదు..
ఒక పత్రిక గొప్పదనం తన సర్క్యులేషన్తో కాదు… తన కథనాల ప్రభావంతో కొలవాలి. ఒక వార్త ప్రచురించిన తర్వాత ఏమైంది? వ్యవస్థ కదిలిందా? అధికారులు స్పందించారా? ప్రజలకు న్యాయం జరిగిందా? అనే ప్రశ్నలకే అసలు విలువ ఉంటుంది. ఆ కోణంలో చూస్తే… కాకతీయ తొలి ఏడాది ప్రయాణం అనేక కీలక మలుపులకు కారణమైంది. కాకతీయ ప్రచురించిన కథనాలు కేవలం వార్తలుగా ముగియలేదు. చాలా సందర్భాల్లో అవి ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు కదిలించాయి. అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లేలా చేశాయి. కొన్ని చోట్ల విచారణలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తిరిగి ఖజానాకు చేరింది. ఒక ప్రాంతీయ డిజిటల్ మీడియా వేదికకు ఇది చిన్న విజయమేమీ కాదు.
ఇసుక మాఫియాపై నిరంతర యుద్ధం
మొదటి ఏడాది మొత్తం కాకతీయ అత్యంత తీవ్రంగా దృష్టి పెట్టిన అంశం అక్రమ ఇసుక దందా. ఉమ్మడి వరంగల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వందల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ ఎలా సాగుతోంది? ప్రభుత్వ నిబంధనలను ఎలా తుంగలో తొక్కుతున్నారు? అధికార యంత్రాంగంలో ఎవరి పాత్ర ఏమిటి? అనే అంశాలను వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. మణుగూరు పరిసరాల్లో రైతులే లేని గ్రామాల పేరుతో ఇసుక ర్యాంపులు ఎలా వచ్చాయి? సింగరేణి భూముల్లో అక్రమ తవ్వకాలు ఎలా సాగుతున్నాయి? గిరిజనుల పేరుతో నకిలీ సొసైటీలు ఎలా సృష్టించారు? రాత్రి వేళల్లో ‘జీరో లారీలు’ ఎలా తిరుగుతున్నాయి? వంటి ప్రశ్నలను మొదటిసారి ఆధారాలతో ప్రజల ముందుంచింది. ఇది ఒక్కరోజు వార్త కాదు. నెలల తరబడి కొనసాగిన పరిశోధన. అధికారుల వివరణలు సేకరించింది. బాధితుల వాంగ్మూలాలు నమోదు చేసింది. ప్రభుత్వ పత్రాలు పరిశీలించింది. ఆ తర్వాతే కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాల తర్వాత ఇసుక అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రజలు కూడా ప్రశ్నించడం ప్రారంభించారు. బెదిరింపులు… కేసుల ప్రయత్నాలు… అయినా వెనక్కి తగ్గలేదు. అక్రమాలపై రాస్తే అభినందనలు మాత్రమే రావు. బెదిరింపులు కూడా వస్తాయి. కాకతీయ కూడా అదే అనుభవించింది. ములుగు జిల్లాలో ఇసుక సొసైటీల కేటాయింపులపై వెలువడిన కథనాలు పెద్ద చర్చకు దారితీశాయి. బాధితులు అందించిన పత్రాలు, ఆధారాలతో ప్రచురించిన వార్తలు కొందరికి అసహనాన్ని కలిగించాయి. ఆ తర్వాత పత్రికపై ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగాయి. పోలీసు కేసులు పెట్టించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ వాస్తవాలు, ఆధారాల ముందు అవన్నీ నిలబడలేకపోయాయి. ఒక వార్తను ఖండించాలంటే ఆధారాలతో ఖండించాలి. కానీ కథనాలను తప్పుబట్టలేని వారు… పత్రికను లక్ష్యంగా చేసుకోవడం కొత్త విషయం కాదు. కాకతీయ దాన్నీ ఎదుర్కొంది.
మేఘా అక్రమాలపై కలం… ఖజానాకు రూ.42 లక్షలు
దేశంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మేఘా సంస్థపై కథనాలు ప్రచురించడం అంత సులభమైన విషయం కాదు. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని కౌకొండ గుట్టలను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వుతున్నారనే సమాచారం వచ్చినప్పుడు… కాకతీయ దానిని సీరియస్గా తీసుకుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనుమతుల పరిస్థితిని పరిశీలించింది. సంబంధిత శాఖల నుంచి సమాచారం సేకరించింది. ఆ తర్వాత వరుస కథనాలు ప్రచురించింది. ఆ కథనాల ప్రభావంతో అధికారులు విచారణ చేపట్టారు. చివరకు అక్రమాలకు జరిమానా విధించి… మేఘా సంస్థ నుంచి రూ.42 లక్షలు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. ఒక ప్రాంతీయ మీడియా కథనం ప్రభుత్వానికి నేరుగా ఆదాయం తెచ్చిపెట్టిన అరుదైన ఉదాహరణగా ఇది నిలిచింది. ప్రభుత్వం స్పందించింది… అదే మా బలం. పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం స్పందించేలా చేయాలి. కాకతీయ కథనాల తర్వాత అనేక శాఖలు స్పందించాయి. కొన్ని చోట్ల అక్రమ తవ్వకాలపై చర్యలు జరిగాయి. కొన్ని చోట్ల అధికారుల వివరణలు వచ్చాయి. మరికొన్ని చోట్ల విచారణలు ప్రారంభమయ్యాయి. ఇది కాకతీయ విజయమే కాదు… ప్రజా జర్నలిజం విజయమని చెప్పాలి.
నేటి మీడియాపై వచ్చే పెద్ద విమర్శ ఏమిటంటే… ప్రకటనల కోసం వార్తలు మారుతున్నాయనేది.
కాకతీయ మాత్రం మొదటి ఏడాది ఈ విమర్శకు భిన్నంగా నిలిచింది. ప్రకటన ఇచ్చినవారిపై కూడా అవసరమైతే కథనాలు ప్రచురించింది అధికార పార్టీ నేతలపైనా రాసింది. ప్రతిపక్ష నేతలపైనా రాసింది.
అధికారులపై కూడా రాసింది. వ్యాపార సంస్థలపైనా రాసింది. ఎందుకంటే కాకతీయకు ప్రమాణం ఒకటే…
“వార్త నిజమా… కాదా?” అంతే. సోషల్ మీడియా శబ్దం కాదు… ఆధారాలే బలం. ఈరోజు ఒక పోస్టు వైరల్ అయితే… అది వార్త అయిపోతున్న కాలం. కానీ కాకతీయ మాత్రం వైరల్ను కాదు… వాస్తవాన్ని నమ్మింది.
ప్రతి కథనం వెనుక డాక్యుమెంట్లు. ప్రతి ఆరోపణ వెనుక ఆధారాలు. ప్రతి విశ్లేషణ వెనుక క్షేత్రస్థాయి సమాచారం. అందుకే కాకతీయ కథనాలను ప్రజలు విశ్వసించడం ప్రారంభించారు. ప్రజలే మా రిపోర్టర్లు.
ప్రజలు తమ సమస్య చెప్పడానికి నమ్మిన వేదికగా కాకతీయ మారడం… ఈ ఏడాది సాధించిన అతి పెద్ద విజయాల్లో ఒకటి. పత్రికలు మూతపడటానికి కారణం ఆర్థిక సమస్యలు మాత్రమే కావు. విలువలు కోల్పోవడమూ ఒక కారణమే. పరిమిత వనరులతో పనిచేస్తూ కూడా… కాకతీయ తన సంపాదకీయ స్వాతంత్య్రాన్ని కాపాడుకుంది. ఒత్తిడికి తలవంచలేదు. బెదిరింపులకు భయపడలేదు. అవమానాలకు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఈ పత్రిక వెనుక ఉన్న అసలు బలం… కార్యాలయం కాదు… పాఠకుల విశ్వాసం. ఈ పోరాటం ఇంకా ముగియలేదు. ఏడాది పూర్తి కావడం ఒక మైలురాయి మాత్రమే.
మాది గమ్యం కాదు.. ఎప్పుడూ గమనమే ముఖ్యం మాకు. ఇంకా బయటపడాల్సిన అక్రమాలు ఉన్నాయి.
ప్రశ్నించాల్సిన అధికార వ్యవస్థ ఉంది. న్యాయం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది ఉన్నారు.
అవినీతి, మాఫియా, అక్రమాలు రూపం మార్చుకుంటాయి. కానీ వాటిని ప్రశ్నించే కలం కూడా ఆగకూడదు. కాకతీయ రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ… ఒక వాగ్దానం మాత్రం మళ్లీ పునరుద్ఘాటిస్తోంది. మా కలం అధికారానికి కాదు… ప్రజలకు అంకితం. మా బాధ్యత వార్తలు ప్రచురించడం మాత్రమే కాదు… ప్రజా ప్రయోజనాలను కాపాడే ప్రతి పోరాటంలో ముందుండడం. సత్యం కోసం మొదలైన ఈ ప్రయాణం… మరింత పదునుగా, మరింత ప్రజాపక్షంగా, మరింత నిర్భయంగా కొనసాగుతుంది.


