బడికి రాకుంటే.. ఉద్యోగానికి గుడ్బై!
ఏడాది గైర్హాజరైతే సర్వీసు నుంచి తొలగింపు
ఐదేళ్లు విధులకు దూరమైతే రాజీనామా చేసినట్లే
పర్యవేక్షణలో విఫలమైతే అధికారులపైనా వేటు
ప్రభుత్వ బడుల్లో పని సంస్కృతికి పెద్దపీట
విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రక్షాళన
నిర్లక్ష్య ఉపాధ్యాయులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరుపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. పాఠశాలలకు సక్రమంగా హాజరుకాకుండా ముందస్తు అనుమతి లేకుండా దీర్ఘకాలం విధులకు దూరంగా ఉండే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. నిరంతరం ఏడాది పాటు విధులకు గైర్హాజరైతే సర్వీసు నుంచి తొలగించే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఐదేళ్లపాటు విధులకు దూరంగా ఉంటే సర్వీసుకు రాజీనామా చేసినట్లుగా పరిగణించనున్నట్లు పేర్కొంది. గతంలో నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలులో నిర్లక్ష్యం కనిపించిందన్న అభిప్రాయంతో.. ఇకపై క్షేత్రస్థాయిలో ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు బోధనా ప్రమాణాలపై నేరుగా ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు తరచూ గైర్హాజరైతే పేద, బలహీన వర్గాల విద్యార్థుల చదువులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తరగతి గదిలో ఉపాధ్యాయుల అందుబాటు లేకపోవడంతో విద్యార్థులు నాణ్యమైన బోధనకు దూరమవుతున్న పరిస్థితికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందస్తు అనుమతి లేకుండా దీర్ఘకాలం విధులకు గైర్హాజరయ్యే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏడాది పాటు నిరంతరం విధులకు దూరంగా ఉంటే సర్వీసు నుంచి తొలగించే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఐదేళ్లపాటు విధులకు హాజరుకాకపోతే సర్వీసుకు రాజీనామా చేసినట్లుగా పరిగణించే నిబంధనను అమలు చేయనున్నారు.
అధికారులదీ బాధ్యతే..
గైర్హాజరైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఉపాధ్యాయుడి గైర్హాజరును నమోదు చేయడం కాకుండా.. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యవేక్షణ అధికారులపై ఉంటుంది. ఎవరైనా ఉపాధ్యాయుడు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే వెంటనే హాజరు రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాలి. చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే తప్పు చేసిన వారు తప్పించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల స్థానిక స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
బడుల్లో క్రమశిక్షణే కీలకం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడంతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యత, బోధనా ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఉపాధ్యాయుల హాజరుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పాఠశాలలో ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటేనే బోధన సజావుగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా పడుతోంది. తరగతులు సక్రమంగా నిర్వహించకపోవడం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలకు ఇది కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు కఠిన నిబంధనల అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కక్షసాధింపునకు తావులేకుండా..
కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ నిజమైన అనారోగ్యం, అనివార్య పరిస్థితులతో విధులకు హాజరుకాలేని ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. అనుమతులు, వైద్య ధ్రువపత్రాలు, సెలవు వివరాలు తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి కక్షసాధింపు చర్యలకు తావులేకుండా పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు ఉండాలని విద్యావర్గాలు సూచిస్తున్నాయి. అదేవిధంగా గైర్హాజరు రికార్డులను పక్కాగా నిర్వహించడం, నోటీసులు సకాలంలో జారీ చేయడం, సంబంధిత ఉపాధ్యాయుడి వివరణ తీసుకోవడం వంటి ప్రక్రియలను పారదర్శకంగా అమలు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ హాజరు వ్యవస్థను సమర్థంగా వినియోగిస్తే ఉపాధ్యాయుల హాజరుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
శిక్షలతోపాటు ప్రోత్సాహం
ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు పాఠశాలల్లో వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోధనకు అనుకూలమైన వాతావరణం, అవసరమైన సదుపాయాలు ఉంటే ఉపాధ్యాయులు మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉంటుంది. ఒకవైపు అనధికార గైర్హాజరుపై కఠిన చర్యలు.. మరోవైపు విధులను సమర్థంగా నిర్వహించే ఉపాధ్యాయులను ప్రోత్సహించే విధానం అమలు చేస్తే ప్రభుత్వ విద్యారంగంలో పని సంస్కృతి మెరుగుపడే అవకాశం ఉంది. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుల హాజరు, బోధన, పర్యవేక్షణ వ్యవస్థలు పటిష్ఠంగా పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం చేపడుతున్న విద్యారంగ ప్రక్షాళనకు ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉంది.

