పాత కక్షలతో యువకుడి హత్య
నేతాజీ గ్రౌండ్లో శివపై మూకుమ్మడి దాడి
ఫోన్ చేసి పిలిచి దాడి.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి
మణుగూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం
కాకతీయ, మణుగూరు : మణుగూరులో పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నేతాజీ గ్రౌండ్లో బుధవారం జరిగిన మూకుమ్మడి దాడిలో సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ (28) తీవ్రంగా గాయపడి గురువారం మృతి చెందాడు. హైదరాబాద్లో ఇంటీరియర్ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శివను ఫోన్ చేసి గ్రౌండ్కు పిలిపించి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనతో మణుగూరులో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ వద్ద పనిచేసే సుందరయ్యనగర్కు చెందిన సతీష్తో గతంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకున్న ఎంకే గ్యాంగ్ నాయకుడు రమాకాంత్ అలియాస్ రమ్మీ అలియాస్ జెట్టి, అతని అనుచరులు శివ మణుగూరుకు వస్తే చంపేస్తామని ఫోన్లో బెదిరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 7 గంటలకు శివ హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చాడు. అనంతరం రమాకాంత్ అలియాస్ జెట్టి ఫోన్ చేసి నేతాజీ గ్రౌండ్కు రావాలని పిలవడంతో ఇంటి పక్కన ఉండే ఉదయ్కుమార్తో కలిసి అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న రమాకాంత్ అలియాస్ జెట్టి, భరత్, సాధిక్, వినయ్, ధినేష్, జంపయ్య, ప్రసాద్ తదితరులు శివపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉదయ్కుమార్పై కూడా దాడి చేసినట్లు తెలిపారు.



ఆసుపత్రికి తరలించేలోపే..
దాడిలో తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శివ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శివ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఘటనలో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మణుగూరులో యువకుల గ్యాంగ్లు ఏర్పడి రాత్రివేళల్లో గుంపులుగా తిరగడం, బైక్లపై స్టంట్లు చేయడం, ముగ్గురు చొప్పున ప్రయాణించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాదకద్రవ్యాల ప్రభావంతో కొందరు యువకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణనష్టాలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
ఘటనపై సమాచారం అందుకున్న మణుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి దారితీసిన కారణాలు, ఘటనలో పాల్గొన్న వారి వివరాలు, శివ మృతికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. గ్రౌండ్లో జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.

