రాజేందర్రావుకు ‘ఫ్రీహ్యాండ్’ ఇవ్వాలి
పీసీసీ ప్రధాన కార్యదర్శికి కరీంనగర్ నేతల వినతి
ఏక నాయకత్వంతోనే పార్టీ బలోపేతం
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయాలంటే ఒకే నాయకత్వానికి పూర్తి బాధ్యతలు అప్పగించడం అవసరమని పేర్కొన్నారు. రాజేందర్రావుకు పని చేసే స్వేచ్ఛను ఇస్తూ, ఇతరుల జోక్యం లేకుండా ‘ఫ్రీహ్యాండ్’ ఇవ్వాలని కోరారు. తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు విన్నవించారు. దీనిపై చంద్రశేఖర్రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. నేతల అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నగర కార్పొరేటర్లు, పోటీ చేసిన అభ్యర్థులు, మండలాధ్యక్షులు, మైనారిటీ విభాగం నేతలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

