ఆర్టీసీ డిపోల్లో మే డే సంబరాలు
పీఆర్సీ పెంపు, ఎన్నికల నిర్వహణపై హర్షాతిరేకాలు
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం
కాకతీయ, కరీంనగర్ : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టాండ్ పరిధిలోని ఆర్టీసీ డిపో-1, 2లలో మే డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్మికుల చిరకాల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ వేడుకలను పండుగలా నిర్వహించారు. డిపో-1లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్ పాల్గొని కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పడాల రాహుల్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కొనియాడారు. 11 శాతం పీఆర్సీ పెంపు, గుర్తింపు సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. గతంలో 50 రోజులు సమ్మె చేసినా పరిష్కారం కాని సమస్యలను, ప్రస్తుత ప్రభుత్వం కేవలం రెండు రోజుల సమ్మెతోనే సానుకూలంగా స్పందించి పరిష్కరించడం విశేషమన్నారు.
కార్మిక పోరాట స్ఫూర్తి..
1886లో అమెరికాలో 8 గంటల పని విధానం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని (మహాలక్ష్మి) విజయవంతం చేయడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. డిపో-2లో జరిగిన కార్యక్రమంలో అంజన్ కుమార్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి మే డే ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకుడు జక్కుల మల్లేష్, కాంగ్రెస్ నాయకులు పొన్నం శ్రీనివాస్, కార్పొరేటర్ భూమయ్య, ఆకుల ఉదయ్, జారిపోతుల వాసు, ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ ప్రెసిడెంట్ ప్రకాష్, నాయకులు మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

